Saturday, September 21, 2024

AP | ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీపై వేటు…

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాయాంలో ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థకు ఎండీగా పని చేసిన మధుసూదన్ రెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పట్లో ఫైబర్ నెట్ సంస్థకు ఎండీగా ఉండి అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఎండీ హోదాలో ఈయన కేంద్ర సర్వీసుల నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఈ సందర్భంగా మధుసూధన్ రెడ్డి అమరావతి వదిలి వెళ్లకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆయన ఎల్లప్పుడూ విచారణకు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించింది. అయితే, ఏపీలో మధుసూదన్ రెడ్డి డిప్యుటేషన్ ఆగస్టు 22తో ముగియనుంది. ఆయన 2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్స్ సర్వీసు నుంచి డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. అయితే, ఫైబర్ నెట్ లో అక్రమాలపై విచారణ నేపథ్యంలో, ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది.

ఈ నేప‌థ్యంలో మధుసూదన్ రెడ్డిపై విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం రైల్వే బోర్డు చైర్మన్ కు లేఖ రాసింది. ఫైబర్ నెట్ లో అక్రమాలపై విచారణ జరుగుతోందని, ఈ విచారణకు మధుసూదన్ రెడ్డి అందుబాటులో ఉండడం కోసం, ఆయన డిప్యుటేషన్ ను మరో ఆరు నెలలు పొడిగించాలని రైల్వే బోర్డును కోరింది.

ఎండీ హోదాలో ఉన్న మధుసూదన్ రెడ్డి కేంద్ర సర్వీసుల నిబంధనలను ఉల్లంఘించార‌ని, ఫైబర్ నెట్ సంస్థ కనెక్షన్ల సంఖ్య బాగా తగ్గినట్లుగా లెక్కలు చూపారని.. కానీ, అసలు వసూలైన బిల్లుల మొత్తాన్ని ముంబయిలోని బినామీ ఖాతాలకు మళ్లించినట్లుగా మధుసూధన్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఎండీ హోదాలో ఉన్న మధుసూధన్ ఏకంగా ప్రతి నెలా రూ.14 కోట్ల చొప్పున 17 నెలల్లో రూ.238 కోట్ల సొమ్మును స్వాహా చేసినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement