Thursday, September 19, 2024

విద్యాకానుక పంపిణీకి సర్వం సిద్ధం.. రేపు ఆదోనిలో ప్రారంభించనున్న సీఎం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుండగా.. అదే రోజున జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం క్లాత్‌(కుట్టు-కూలితో సహా), జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగువల్‌ -టె-క్ట్స్‌బుక్స్‌, నోట్‌బుక్స్‌, వర్క్‌బుక్స్‌తోపాటు- అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు- తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేస్తుంది. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు అందజేస్తారు. ప్రభుత్వం మూడో ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రూ. 931 కోట్లతో..

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47 లక్షల 40 వేల 421 మంది విద్యార్థులకు రూ. 931.02 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్లు అందించనున్నారు. ప్రతీ విద్యార్థికీ దాదాపు రూ. 2 వేల విలువైన వస్తువులు ఆ కిట్‌లో ఉంటాయి. 2020 -21 విద్యా సంవత్సరంలోరూ. 648.10 కోట్ల వ్యయంతో 42,34,322 లక్షల మంది విద్యార్ధులకు అందించగా.. 2021 -22 విద్యా సంవత్సరంలోరూ. 789.21 కోట్లు- ఖర్చు చేసి 45,71,051 లక్షల మందికి అందించారు. ఇప్పటివరకు జేవీకే కోసం చేసిన మొత్తం వ్యయం 2,368.33 కోట్లు-గా ఉంది. విద్యారంగంలో సంస్కరణల వల్ల 2018- 19 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్ధుల సంఖ్య 7 లక్షలకుపైగా పెరిగి 2021 – 22 నాటికి 44.30 లక్షలకు చేరింది.

బాలికల కోసం ‘స్వేచ్ఛ’

పాఠశాలలకు వెళ్లే బాలికల డ్రాపౌట్‌ రేట్‌ను తగ్గించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మందికిపైగా విద్యార్ధినులకు ‘స్వేచ్ఛ’ పథకం ద్వారా ఏటా రూ. 32 కోట్ల వ్యయంతో నెలకు 10 చొప్పున ఏడాదికి 120 నాణ్యమైన బ్రాండెడ్‌ శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. తద్వారా బాలికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోగలుగుతారన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కేవలం ఒక్క విద్యారంగంలో సంస్కరణలపై ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఎంతో ఖర్చు చేసింది. జగనన్న అమ్మ ఒడి పథకం కింద 44,48,865 మందికి రూ. 19,617.53 కోట్లు-, జగనన్న విద్యా దీవెన కింద 21,55,298 మంది, జగనన్న వసతి దీవెన కింద 18,77,863 మందికి రూ. 11,007.17 కోట్లు- వెచ్చించింది. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1,778 కోట్లు- కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. అలాగే జగనన్న గోరుముద్ద పథకం కింద 43,26,782 మందికి నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు మొత్తం రూ. 3,087.50 కోట్లు వెచ్చించింది. పాఠశాలల్లో నాడు- నేడు మొదటి దశలో 15,715 స్కూళ్ళ బాగు కోసం రూ. 3,669 కోట్లు- ఖర్చు చేసి, రెండో దశలో 22,344 స్కూళ్ళను బాగు చేసే కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రపంచస్ధాయిలో పోటీ-పడేలా మన పిల్లలను సన్నద్దం చేసేందుకు దేశంలోనే అతి పెద్ద ఎడ్యుకేషనల్‌ -టె-క్‌ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఏటా రూ. 24 వేల వరకు ఖర్చయ్యే ఈ స్డడీ మెటీ-రియల్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతిలో చేరబోతున్న 4.7 లక్షల మంది విద్యార్ధులకు రూ. 500 కోట్ల ఖర్చుతో రూ. 12 వేల విలువ చేసే ట్యాబ్‌లు ఉచితంగా ఈ సెప్టెంబర్‌ నెలలోనే ఇవ్వనుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement