Saturday, September 28, 2024

AP: స్టీల్ ప్లాంట్ లో కార్మికుల తొల‌గింపు… 30న పాద‌యాత్ర‌కు పిలుపు

నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికుల గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలంటూ హెచ్‌ఒడిలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇది తొలగింపు చర్యేనంటూ ఒక్కసారిగా పిడుగుపడిన మాదిరిగా ఉక్కు ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికులు నిర్ఘాంతపోయారు. కేంద్రం ఆదేశాల ప్రకారం ఒక క్రమ పద్ధతిలో కార్మికుల తగ్గింపు ప్రక్రియను స్టీల్‌ప్లాంట్‌ వేగవంతం చేసింది. ఓ పక్క టీడీపీ కూటమి నేతలు, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేష్‌ మొదలుకొని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్న దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలున్నాయి.

జనరల్‌ షిఫ్టుల్లో ఉండే ఇంజనీరింగ్‌ ఇన్‌ఛార్జులు అందరితోనూ యాజమాన్యం సమావేశం నిర్వహించింది. 30శాతం కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధుల నుంచి వెనక్కి పంపాలని ఆదేశించింది. వారి గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలని ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లోని కాంట్రాక్టర్లకు, సూపర్‌వైజర్లకు హుకుం జారీ చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కాంట్రాక్టు కార్మికులంతా తమ గేట్‌ పాస్‌లను ఇవ్వకూడదని నిర్ణయించినట్లు స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ (సిఐటియు) నాయకులు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఓవైపు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు మూడింటిలో రెండింటిని మూసేసి ఉత్పత్తిని రోజుకు నాలుగు వేల టన్నులకు యాజమాన్యం దిగజార్చింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్‌నార్‌ ప్లాంట్‌కు 500మందిని పంపించే ఏర్పాట్లను వేగవంతం చేసింది. తాజాగా కాంట్రాక్టు కార్మికులపై పడింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement