Tuesday, October 1, 2024

Dairy Farm – తిరుమ‌లలోడెయిరీ పెట్టండి … వెయ్యి గోవులను అందిస్తా

లక్ష ఆవుల‌ను దాత‌ల సాయంతో సమీక‌రిస్తా
శ్రీ‌వారి కోసం సొంత‌ డెయిరీకి ప్లాన్ చేయండి
రోజుకు 30 టన్నుల నెయ్యి తయారీ చేయొచ్చు
10 వేల మందికి ఉపాధి కల్పించే చాన్స్ ఉంది
టీటీడీకి బీసీవై పార్టీ అధినేత‌ రామచంద్ర యాదవ్ సూచన
తిరుమల పరిరక్షణ పాదయాత్ర ముగింపులో సంచలన ప్రకటన
గోవుల‌ను పెంచి, పోషించ‌డమూ ధార్మిక ప్ర‌చార‌మేన‌ని వెల్ల‌డి

ఆంధ్రప్రభ స్మార్ట్, తిరుమల : తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేసి, సొంతంగా నెయ్యి తయారు చేస్తే తన వంతుగా భూరి విరాళం అందిస్తాన‌ని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్నారు. తిరుమ‌ల ప‌రిర‌క్ష‌ణ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీ‌వారికి అప‌చారం జ‌ర‌గ‌కుండా తానే ఓ పెద్ద బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. వందలాది మంది భక్తులతో కలిసి ఆయన చేపట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్ర మంగళవారం ఉదయం స్వామి దర్శనంతో ముగిసింది.. ఈ సందర్భంగా తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు.. లడ్డూ ప్రసాదం తయారీ సహా స్వామి పూజల్లో వినియోగించే నెయ్యిని సొంతంగా తయారు చేయాలని సూచించారు.

- Advertisement -

వెయ్యి గోవులను ఇస్తా..

కోట్లాది మంది భక్తులు.. వేల కోట్ల ఆస్తులు ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో సొంతంగా డెయిరీ లేకపోవడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయని, లడ్డూ ప్రసాదం సహా, పూజలో వినియోగించే నెయ్యి కూడా అపవిత్రం అవుతోందని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సొంత డెయిరీ ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేస్తే తన వంతుగా టీటీడీకి వేయి ఆవులు ఇస్తానన్నారు. మరో లక్ష ఆవులను సమీకరిస్తానని దీనిపై టీటీడీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. లక్ష ఆవులతో తిరుమలలో సొంతగా డెయిరీ ఏర్పాటు చేస్తే రోజుకి కనీసం 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుందని.., తద్వారా 50 వేల కిలోల వెన్న ఉత్పత్తి ఉంటుందన్నారు, ఇలా రోజుకి సుమారుగా 30 వేల కిలోల నెయ్యిని సొంతగా తయారు చేసుకోవటం సాధ్యమని వివరించారు.

10 వేల మంది గోపాలకులకు ఉపాధి

ఈ మేరకు లక్ష గోవులతో గోశాల ఏర్పాటు చేస్తే.. 10 వేల మంది గోపాలకులకు ఉపాధి కల్పించవచ్చని.. వీలైతే వారిని యాదవ సామాజికవర్గం నుంచి తీసుకుంటే.. గో సేవకులుగా సమర్ధవంతంగా, ఆసక్తిగా పని చేయగలరని సూచించారు.. తిరుమల ధార్మిక సంస్థ ఇక్కడ వ్యాపారాలు, ఇతర కార్యక్రమాలు సబబు కాదని, గోవులను పెంచి, డెయిరీ నిర్వహించడం కూడా ధర్మ ప్రచారంలో భాగమేనని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని గోశాలను ప్రారంభించాలని సూచించారు. తిరుమల పరిరక్షణ, పవిత్రత ధ్యేయంగా సెప్టెంబర్ 27న పుంగనూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర నేటితో ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement