Tuesday, September 24, 2024

Counter – పొన్న‌వోలుకు ఆహంకారం – ప్ర‌కాష్ రాజ్ కు నోరు దురుసు – ప‌వ‌న్ క‌ల్యాణ్

విజ‌య‌వాడ – సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోందని చెప్పారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమలలో హైడ్రామా చేశారని దుయ్యబట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను ఈరోజు పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.

తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో గతంలో టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి ఎక్కుడున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు.

తిరుమల లడ్డూపై వ్యంగ్యంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని, వ్యంగ్యంగా మాట్లాడటానికి ఇది సరైన విషయం కాదని తేల్చిచెప్పారు. తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాలనే అనుసంధానం ఉండాలి కానీ అహంకారంతో మాట్లాడటం సరికాదని పవన్ హెచ్చరించారు. తాను ఏ మతంపై విమర్శలు చేయలేదని, తిరుమల లడ్డూ అపవిత్రం అయితే దానిపై స్పందించడం తప్పేమిటని పవన్ ప్రశ్నించారు. దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతున్నప్పుడు తాను ఎలా నిశ్శబ్దంగా ఉంటానని ఆయన అన్నరు.

సనాతన ధర్మంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయకూడదని, ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా మాట్లాడితే తాను ఊరుకోబోనని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి రివర్స్‌లో మాట్లాడుతున్నారని, మౌనంగా ఉండకూడదనే భావంతో అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టు చూపిస్తూ, హిందువులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఆందోళనలు కలిగిస్తున్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. సెక్యులరిజం అంటే రెండు వైపులా సమానంగా చూడాలని ఆయన సూచించారు.

స్టార్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ ఖండించారు. శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడని సూచించారు. తాను ఇంకో మతాన్ని నిందించలేదని, లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్పా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రకాశ్ రాజ్ అంటే గౌరవం ఉందని, తన ధర్మంపై మాట్లాడొద్దంటే ఎలా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. సెక్యూలరిజం అంటే రెండు మార్గాలని, ప్రకాశ్ రాజు వాటి గురించి తెసుకున్న తర్వాత మాట్లాడాలని సూచించారు. సనాతన ధర్మం అంటే తమ సెంటిమెంట్ అని, సరదాగా మాట్లాడే ముందే 100 సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై వ్యంగ్యంగా మాట్లాడితే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పాడాల్సిన బాధ్యత గుడికి వెళ్లే ప్రతి హిందువు బాధ్యత అని పవన్ కల్యాణ్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement