(ఆంధ్రప్రభ, కడప బ్యూరో) : ఏపీలో బీజేపీ ‘బీ’ టీమ్ నడిపిస్తోందని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. వీళ్ళ రిమోట్ కంట్రోల్ మొత్తం నరేంద్ర మోడీ చేతిలో ఉందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం కడప పట్టణంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏపీ హక్కులపై ఢిల్లీలో వైఎస్ఆర్ పోరాటం చేశారని, ఇక్కడి పాలకులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మోడీ చేతిలో సీబీఐ ఉంది.. ఈడీ ఉంది.. అందుకే బీ టీమ్ మోదీ చెప్పు చేతుల్లో ఉన్నారన్నారు. రాజకీయాల్లో కుటుంబ సంబంధాలు ఉంటాయని, వైఎస్ఆర్ నా తండ్రికి సోదరుడు.. రాజీవ్,వైఎస్ఆర్ ఇద్దరు ఆన్న తమ్ముళ్లు. ఈ బంధం చాలా ఏళ్ళ కిందటి నుంచే ఉందన్నారు. వైఎస్ఆర్ దేశానికి మార్గదర్శకుడని, వైఎస్ఆర్ పాదయాత్ర నాకు ఆదర్శం అన్నారు. ఆయన స్ఫూర్తితోనే నేను జోడో యాత్ర చేశాను అని రాహుల్ గాంధీ అన్నారు.
వైఎస్ఆర్ స్ఫూర్తితోనే జోడో యాత్ర
దేశం మొత్తం పాదయాత్ర చేయాలనివైఎస్ఆర్ నాకు చెప్పారని.. నాకు అన్ని విషయాల్లో మార్గదర్శకుడిగా ఉన్నారని రాహుల్ అన్నారు. పాదయాత్ర చేస్తే ప్రజల్లోకి వెళ్తాం అని వైఎస్ఆర్ నాకు చాలాసార్లు చెప్పారన్నారు. పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుస్తాయని, అందుకే భారత్ జోడో యాత్రతో ఈ దేశపు వీధులన్నీ తిరిగానన్నారు. వైఎస్ఆర్ సామాజిక న్యాయం కోసం రాజకీయం చేశాడని, ఇప్పుడు ఏపీలో అది లేదన్నారు. ఇప్పుడు మార్పు రాజకీయాలు నడుస్తున్నాయి అని వివరించారు.
అక్రమాలు బయట పడతాయనే భయం
వైఎస్ఆర్ సిద్ధాంతం… కాంగ్రెస్ సిద్ధాంతం ఒకటే.. బీజేపీకి వ్యతిరేకం అని, జగన్ మాత్రం బీజేపీ కి మద్దతుగా ఉన్నారన్నారు. అవినీతి బయట పడుతుందనే భయంతోనే బీజేపీ నీ జగన్ ఒక్క మాట అనరు. ఇదే భయం చంద్రబాబుకూ ఉందన్నారు. ఏపీ హక్కులు ఢిల్లీలో వినపడాలి అంటే.. కాంగ్రెస్ రావాలన్నారు. ఏపీ విభజన అయ్యాక బీజేపీ ఎన్నో హామీలు చేసింది.. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా?.. పోలవరం కట్టారా?. కడప స్టీల్ కట్టారా?. బీజేపీ ముందు ఏపి ఆత్మ గౌరవం తల దించుకొని ఉంది అని రాహుల్ ప్రశ్నించారు.
ఏపీలో అవినీతి సర్కారు నడుస్తోంది
ఏపీలో అవినీతి సర్కారు నడుస్తోందని, 2014 లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే అన్ని హామీలు నెరవేర్చేదన్నారు. 2024లో కాంగ్రెస్ అధికారంలో వచ్చాకా ఇచ్చిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తామన్నారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ కడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము కొన్ని వాగ్ధానాలు ఇచ్చామని, రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేస్తాం, నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం, రాష్ట్రంలో 2.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని రాహుల్ హామీ ఇచ్చారు.
అధికారంలోకి రాగానే …అన్నీ
కేంద్రంలో అధికారంలోకి రాగానే చరిత్రలో ఎవరు చేయని ఆలోచనలు చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను ఎంపిక చేసి.. ఆ మహిళ బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు ఏడాదికి ఇస్తామన్నారు. ప్రతి నెల 8500 రూపాయలు ఇస్తామని, కోట్లాది మంది జీవిత శైలి మారుతుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. ప్రతి ఏడాది 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదీ అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రూ.400లకు కి పెంచుతామని, రాజ్యాంగాన్ని రక్షించే పనిలో ఉన్నామన్నారు. ఈ రాజ్యాంగం పరిరక్షిస్తే మనకు హోదా వస్తుందన్నారు. మోడీ ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మోడీ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. భారతీయుల భవిష్యత్ మన రాజ్యాంగం మీద ఆధారపడి ఉందన్నారు.
చార్జి షీట్ లో వైఎస్ పేరు చేర్చలేదు..
కాంగ్రెస్, వైఎస్ఆర్ ఒక్కటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఆలోచనలకి వ్యతిరేకంగా కాదన్నారు. సీబీఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పేరును చేర్చలేదు.. ఇది స్వార్థం కోసం చేసిన పనే అన్నారు. వైఎస్ఆర్ మా వాడు, వైఎస్ఆర్ బిడ్డ నా చెల్లెలు షర్మిల ఇవ్వాళ మీ ముందు నిలబడిందన్నారు. షర్మిల ముందు ఏ సీబీఐ, ఏ ఈడీ నడవదన్నారు. షర్మిలను పార్లమెంటుకు పంపుతామని హామీ ఇవ్వాలని రాహుల్ కోరారు.