Friday, October 18, 2024

AP: ఎన్డీయే హయాంలో ఏపీ సమగ్రాభివృద్ధి.. ఎంపీ కేశినేని చిన్ని

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో..
  • అన్ని ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పన…
  • మ‌ధురాన‌గ‌ర్ ఆర్.యు.బి ప్రారంభం..


( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరుగుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ పేర్కొన్నారు. మధురా నగర్ వాసుల చిరకాల క‌ల ఆర్.యు.బి ని ప్రారంభించ‌టం సంతోషంగా ఉందన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి పనులు వెంటనే పూర్తి చేసి ఆర్.యు.బి ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వానికే దక్కిందన్నారు. ఎన్డీయే కూట‌మి అభివృద్దికి చిరునామాగా నిలుస్తోందని చెప్పారు. విజయవాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మధురనగర్ – భాను నగర్ రైల్వే ఆర్.యు.బి ర‌హ‌దారిని శుక్ర‌వారం ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో క‌లిసి ప్రారంభించారు.

ముందుగా ఆర్.యు.బి ర‌హ‌దారి దగ్గ‌ర ఏర్పాటు చేసిన శిలాప‌లాకాన్ని ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా ఆవిష్క‌రించి, అనంతరం రిబ్బ‌న్ క‌ట్ చేసి ఆర్.యు.బి ర‌హ‌దారిని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియా మాట్లాడుతూ… సెంట్రల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో తాను కూడా భాగస్వామ్యం అవుతాననీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. సెంట్రల్ నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గంలో వి.ఎం.సి, రైల్వే వారితో అనుసంధానం గా వున్న పనులు చాలా పెండింగ్ లో వున్నాయని, ఆ ప‌నులు వెంటనే పూర్తి చేసేందుకు వి.ఎం.సి అధికారుల‌తో మాట్లాడాల‌ని రైల్వే అధికారుల‌కు చెప్ప‌టం జ‌రిగిందన్నారు.

మున్సిప‌ల్ అధికారులు, రైల్వే అధికారుల‌తో క‌లిసి జాయింట్ క‌మిటీ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. మ‌ధురాన‌గ‌ర్ లో రైల్వే శాఖ‌తో ముడిప‌డి వున్న ల్యాండ్ ఇష్యూ పై త్వ‌ర‌లో ఎమ్మెల్యే బొండా ఉమాతో క‌లిసి రైల్వే అధికారులు, వి.ఎం.సి అధికారుల‌తో మాట్లాడ‌తామ‌న్నారు. సెంట్ర‌ల్, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్లు, ఆర్.యు.బి, ఆర్.వో.బిల‌కు శంకుస్థాప‌న 2014-2019 కాలంలోనే జ‌రిగిందని, గ‌త ప్ర‌భుత్వం మొద్దు నిద్ర‌పోయి, వీటిని నిర్లక్ష్యం చేసి ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కి గురి చేసిందన్నారు. ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఆర్.యు.బి నిర్మాణ ప‌నులు పూర్తి చేసి ప్రారంభించ‌టం జ‌రిగింద‌న్నారు.

- Advertisement -

అంత‌కు ముందు ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మీడియాతో మాట్లాడుతూ… మధురానగర్ వాసుల చిరకాల కల నేడు నెరవేరిందన్నారు. ఆర్.యు.బి నిర్మాణానికి టీడీపీ హయంలో నాటి ఎమ్మెల్యేగా తాను శంకుస్థాపన చేశానని, ఇప్పుడు ప్రారంభోత్సవం టీడీపీ పాలనలోనే జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్ యు బి నిర్మాణం సకాలంలో చేపట్టకుండా ప్రజలను ఇబ్బందులు పెట్టిందన్నారు. తొమ్మిది నెలల కాలంలో పూర్తి కావలసిన ఆర్.యు.బి నిర్మాణం వైసీపీ పాల‌న‌లో అటకెక్కిందన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆర్ యు బి నిర్మాణం పూర్తయింద‌న్నారు. అదేవిధంగా గుణదల దగ్గర ఆగిపోయిన ఫ్లైఓవర్ కూడా నిర్మాణం పూర్తి చేస్తామన్నారు, ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) సహకారంతో  రైల్వే అధికారులతో మాట్లాడి వాంబే కాలనీ వద్ద కూడా ఆర్ యు బి నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలోసెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన ఇన్ ఛార్జ్ బొలిశెట్టి వంశీ కృష్ణ‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, 29వ డివిజన్ ప్రెసిడెంట్ పి వెంకటేశ్వరరావు, 29వ డివిజన్ ఇంచార్జి గౌతమ్ ప్రసాద్, టీడీపీ నాయకులు వీరమాచినేని కిషోర్, సింగం వెంకన్న, అంగిరేకుల రాంబాబు, తుంగం ఝాన్సీ, జ‌న‌సేన నాయ‌కులు శ్యామ్ ప్రసాద్, చీఫ్ ఇంజ‌నీర్ శ్రీకాంత్ రెడ్డి, జోన‌ల్ క‌మీష‌న‌ర్ ప్ర‌భుదాస్, ఈఈ చంద్ర‌శేఖ‌ర్, డీఈఈ గురునాథ్ బాబు, ఏఈ వెంక‌టేష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement