Saturday, September 28, 2024

AP: మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం… మహిళ మృతి

చిత్తూరు, సెప్టెంబర్ 28 (ప్రభ న్యూస్ బ్యూరో) : చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగి.. ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన మరువకముందే శనివారం ఉదయం మరో దుర్ఘటన జరిగింది. వెనుక నుండి వస్తున్న కారు అతివేగంతో ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. 10 రోజుల వ్యవధిలో ఒకే స్థలంలో నాలుగు ప్రమాదాలు జరగడం గమనార్హం.

పలమనేరు వైపు నుంచి చిన్న హిటాచీల రోడ్డుతో వస్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు అతి వేగంతో వస్తూ ఓవర్ టక్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ ఘ‌టనలో కారును లారీ వెనుక వైపు తగిలింది. లారీ కుడి వైపు తిప్పడానికి ప్రయత్నం చేయగా, రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళను ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. లారీ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.

- Advertisement -

కారుకు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. కారులోని వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. లోడ్డుతో వస్తున్న లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో హుటాహుటిన బంగారుపాలెం పోలీసులు అక్కడికి చేరుకొని పడిపోయిన లారీని పక్కకు లాగి, ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. బంగారుపాలెం సిఐ కే.శ్రీనివాసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన మహిళను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement