Friday, October 18, 2024

White Paper Released – జ‌గ‌న్ పాల‌న‌లో విద్యుత్ రంగం స‌ర్వ‌నాశ‌నం – చంద్ర‌బాబు

అమరావతి: భావితరాల భవిష్యత్‌ను గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ”ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చాం. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నాం. విద్యుత్‌తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది.

ఐదేళ్లలో విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. విద్యుత్‌ సంస్కరణల వల్ల నా అధికారం పోయినా దేశం బాగుపడింది. నేను తెచ్చిన సంస్కరణలు వైఎస్‌ హయాంలో కనిపించాయి. మా హయాంలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేశాం. విద్యుత్‌ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నాం. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్‌ ఉత్పత్తి పెంచాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగింది. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి చేరేలా కృషి చేశాం. మా హయాంలో ట్రాన్స్‌కో, జెన్‌కోకు అవార్డులు వచ్చాయి. గత ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపారు. విద్యుత్‌ రంగంలో రూ.49,596 కోట్లు అప్పులు చేశారు.

- Advertisement -

విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పేద ప్రజల నడ్డి విరిచారు

ట్రూఅప్‌, ఇంధన సర్‌ఛార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాలుగా గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసింది. గృహ వినియోదారులపై 45శాతం ఛార్జీలు పెంచారు. ఛార్జీల పెంపుతో కోటీ 53 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 50 యూనిట్లు వాడిన పేదలపై వందశాతం ఛార్జీలు పెంచారు. టారిఫ్‌ ద్వారా రూ.16,699 కోట్లు, ట్రూ అప్‌ ద్వారా రూ.5,886 కోట్లు, ఇంధన ఛార్జీలు రూ.3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో రూ.5,607 కోట్ల మేర వసూలు చేశారు. రూ.వేల కోట్ల రుణం తీసుకుని విద్యుత్‌ రంగంపై పెనుభారం వేశారు. ఐదేళ్లలో విద్యుత్‌ సంస్థల అప్పు 79శాతం మేర పెరిగింది. కొన్ని సార్లు ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలపై భారం మోపాయి. కోర్టు ఆదేశంతో నిర్వహణ ఛార్జీలు రూ.9వేల కోట్లు చెల్లించారు. పవన విద్యుత్‌లో చేసుకున్న 21 ఒప్పందాలు రద్దు చేశారు. అసమర్థ పాలనతో విద్యుత్‌ రంగం 47,741 కోట్లు నష్ట పోయింది. విద్యుత్‌ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది” అని చంద్రబాబు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement