Friday, September 6, 2024

AP – ఇక నిత్య నిఘా – తహసిల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు

ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీ సత్యసాయి బ్యూరో : అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటనతో.. రెవెన్యూ శాఖ కళ్లు తెరుచుకున్నాయి. దస్ర్తాల పదిలం బాధ్యత తాహసీల్దారులదే కావటంతో.. చేతులు కాలక ముందే ఆకులు సిద్ధం చేసుకొంటున్నట్టు ఇక తాహసీల్దార్ కార్యాలయాలపై సీసీ కెమెరాలతో నిత్యం నిఘాను పటిష్ట పర్చుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని తాహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే.. గత అయిదేళ్ల పాలనలో భూకబ్జాలు పెరిగ పోయాయి, రాష్ట్రవ్యాప్తంగా ధనార్జనే ద్యేయంగా అధికార పార్టీ నాయకులు కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములు, పేదల భూముల్ని కైవశం చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పెత్తనాన్ని అడ్డుపెట్టుకొని, రెవెన్యూ రికార్డుల్లో పలు మార్పులు, చేర్పులు చేసి, తమకు అనుకూలంగా మార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారం మారిన కారణంగా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల పరిశీలన గావిస్తే అవినీతి, అక్రమాలు, రికార్డుల తారుమారు విషయాలు బహిర్గతం కావడం ఖాయమని తెలిసే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డుల దహనం తెరమీదకు వచ్చిందని జనం భావిస్తున్నారు.

జేసీ, సబ్ కలెక్టర్ విస్తృతంగా తనిఖీలు….

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దహనం ఘటన నేపథ్యంలో శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, అపూర్వ భరత్ తహసిల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ రికార్డుల గదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గదులో రికార్డుల భద్రత, నిఘా వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. భద్రత చర్యలు గురించి తహసీల్దారులతో చర్చించారు. జిల్లాలోని 32 తాహసీల్దార్ కార్యాలయాలను మూడు రోజుల పాటు జేసీ, సబ్ కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ఈ స్థితిలో రెవెన్యూ యంత్రాంగంపై ప్రభుత్వం నుంచి ఏ మేరకు ఒత్తడి ఉందో అర్థం కాగలదు..

- Advertisement -

త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు…

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దహనం ఘటన ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా తాహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలకు అనుసంధానం చేసి, కలెక్టర్ మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం శ్రీ సత్య సాయి జిల్లాలో 32 మండలాలు ఉండగా గా ప్రతి మండల కార్యాలయంలో తహసీల్దార్ నేతృత్వంలో ఒక డిజిటల్ అసిస్టెంట్ ను నియమించి, రెవెన్యూ కార్యాలయంలోకి ఎవరు వస్తున్నారు? , ఎవరు వెళ్తున్నారు. అనేది అక్కడే స్కానింగ్ చేసి, నేరుగా కలెక్టర్ కార్యాలయంలో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement