Friday, September 20, 2024

AP | దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం…

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని….. అందుకు తగిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు.

అక్టోబర్‌ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై (బుధవారం) నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన, పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌ బాబు, శాసనసభ్యుడు వై. సుజనా చౌదరి లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ… ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. భక్తుల మనోభావాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకు సైతం సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగి పడకుండా ఇప్పటికే దేవస్థానం పటిష్ట చర్యలు తీసుకుందని అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా మరింత అప్రమత్తంగా అధికారులు ఉండాలన్నారు. క్యూలైన్‌లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ జి. సృజన తెలిపారు.

పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌ బాబు మాట్లాడుతూ… దసరా ఉత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాధి మంది అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు చెందిన పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుండి 3,500 మంది సిబ్బంది సేవలను దసరా ఉత్సవాలలో వినియోగించుకోనున్న‌ట్టు తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనకు ప్రతి నిర్ణీత ప్రాంతం, సెక్టార్‌ (రంగం)కి ఒక ప్రత్యేక అధికారి పరిశీలనలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. దుర్గా ఘాట్‌ సమీపంలో గల కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా దసరా ఉత్సవాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సమావేశంలో డిసిపిలు గౌతమి శాలి, యం. కృష్ణమూర్తి నాయుడు, అడిషనల్‌ డిసిపిలు జి. రామకృష్ణ, యం. రాజరావు, డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, ఆర్‌డివో భవాని శంకర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కిరణ్మయి, దేవస్థానం ఈఈలు ఎల్‌. రమ, కోటేశ్వరరావు, వివిధ విభాగాల సూపరింటెండెంట్‌లు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement