Friday, September 13, 2024

AP: హజ్ యాత్ర -2025 కు దరఖాస్తు చేసుకోండి… మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్

నంద్యాల బ్యూరో, ఆగష్టు 14 ప్రభ న్యూస్ : రాష్ట్రంలోని ముస్లింలు హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదును ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభించిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం తెలిపారు. హజ్ దరఖాస్తుల ఫారమ్‌లను పూరించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 9వ తేదీ వరకు కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించిందని తెలిపారు.

హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, నిర్ణీత గడువు ప్రకారం సమయానికి హజ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి యాత్రికుడు తన మెషిన్ రీడబుల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ హజ్ దరఖాస్తు ముగింపు తేదీకి ముందే జారీ చేయబడి ఉండాలని, 2026 జనవరి 15వ తేదీ వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని తెలిపారు.

వయస్సు వయో పరిమితి లేదని, అయితే శిశువుల ప్రయాణం ఉచితం కాదని, పూర్తి విమాన ఛార్జీలో 10శాతం వసూలు చేయబడుతుందని పేర్కొన్నారు. 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న దరఖాస్తుదారుల‌కు వయోజన యాత్రికుడుగా ఛార్జీ విధించబడుతుందన్నారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా హజ్‌కు అర్హత జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉంటుందని తెలిపారు. మెహ్రమ్ లేకుండా కేటగిరీలో, 45ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల స్త్రీలు 4 లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళల సమూహాలలో ప్రయాణించడానికి నిబంధనల ప్రకారం అనుమతించబడతారని తెలిపారు. హజ్ 2025 కవర్ సైజులో కనీసం ఒకరు, గరిష్టంగా ఐదుగురు పెద్దలు+ఇద్దరు శిశువులు ఉండవచ్చునని తెలిపారు. హజ్-2025కు ఎంపికైన హజ్ యాత్రికులు మెడికల్ స్క్రీనింగ్ అండ్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

అంతేకాకుండా యాత్రికులు ఎంబార్కేషన్ పాయింట్‌కి ప్రాధాన్యతా క్రమంలో రెండు ప్రాధాన్యతలను ఇవ్వాలని, యాత్రికుల బస వ్యవధి 40-45 రోజుల వరకు ఉండవచ్చునని తెలిపారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2024 నుండి ప్రత్యేక హజ్ సువిధ యాప్‌ను ప్రారంభించిందని తెలిపారు. దరఖాస్తుల పరిశీలనను, యాత్రకు సంబంధించి ఇతర వివరాలను తెలియజేయడం, యాత్రకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పన విషయాలు తెలియ పరిచేందుకు సులభతరం చేయడం కోసం భారతీయ హజ్ చేపట్టిన చర్యలతో యాత్రికులకు ఎక్కువ సౌలభ్యం, సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సమాచార సాంకేతికతను ఉపయోగించాలనే లక్ష్యంతో ఆన్ లైన్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారులకు టోల్ ఫ్రీ నెం.1800-4257873, 0866- 2471786 ఫోన్ చేయవచ్చన్నారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులంద‌రూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement