Friday, October 18, 2024

Ap: పేద‌ల సొంతింటి క‌ల‌ నెర‌వేరుస్తాం..మంత్రి పార్థసారథి



ఇళ్లు లేని పేదలకు శాశ్వత గృహాలు

వైసీపీ పాలనలో అన్నీ అవకతవకలే
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గాడిలో పడుతోంది
జర్నలిస్టులంద‌రికీ మేలు చేస్తాం
స్ప‌ష్టంచేసిన మంత్రి కొలుసు పార్థసారథి

ఆంధ్రప్రభ స్మార్ట్, అమరావతి:

రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా వచ్చే అయిదేళ్లలో నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్థేశం చేశారని, ఆ లక్ష్య సాధన దిశగా గృహనిర్మాణ శాఖ ముందుకు అడుగులు వేస్తున్నదని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ మొదటి అంతస్తులో ఆధునీకరించిన తన చాంబర్‌లో శాస్త్రోత్తంగా శుక్రవారం ఆయన ప్రవేశించారు.

- Advertisement -

గత పాలనలో అన్నీ అవకతవకలే

ఎస్సీలకు, బీసీలకు మేమే చాంఫియన్లు అని చెప్పుకునే గత పాలకుల హయాంలో గృహ నిర్మాణ శాఖలో ఎన్నో అవకతవకలు జరిగాయని, నిరుపేదల గృహ నిర్మాణాలకై కేంద్రం ఇచ్చిన దాదాపు రూ.4,500 కోట్ల నిధులను ప‌క్కదోవ పట్టించి నిరుపేదలకు అన్యాయం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క యూనిట్ కు రూ.2.50 లక్షల రుణ సహాయాన్ని అందజేస్తే, దాన్ని రూ.1.80 లక్షలకు తగ్గించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణానికై రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు అదనంగా అందజేసే ఆర్థిక సహాయాన్ని కూడా పూర్తిగా రద్దు చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు

గత ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పిదాలు జరిగాయని, రాష్ట్రాన్ని రూ.10.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దింపడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితికి రాష్ట్రాన్ని తీసుకు వచ్చారన్నారు. రాష్ట్రంలో ఎటు వంటి ఆదాయ వనరులు, అభివృద్ది లేకుండా చేశారని, గతంలో జరిగిన ఇటువంటి తప్పిదాలు అన్నింటినీ చక్కదిద్ది రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం వంద రోజుల పాలనలో ముఖ్యమంత్రి ఎంతగానో కృషిచేశారని మంత్రి తెలిపారు. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, అభివృద్దిని అందిపుచ్చుకునేలా యువతీ యువకులను సిధ్దం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా వారికి బంగారు భవిష్యత్తును ఏర్పాటుచేసే దిశగా కృషి జరుగుతోందని, 2029 నాటికి రాష్ట్ర జీడీపీ , ప్రతి పౌరుడి తలసరి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

జర్నలిస్టులకు మేలు చేస్తాం

రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలోనే కాకుండా, ఇంకా వారికి ఏ విధంగా మేలు చేకూర్చగలమో అనే కోణంలో ఆలోచించి ప్రతిపాదనలు రూపొందించాలని ఈ మధ్య జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లుగా తగు చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెపుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రకటనలు జారీలో ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా తమకు నచ్చిన పేపర్లకు పెద్ద ఎత్తున జారీచేస్తూ, నచ్చని పేపర్లు వాటంతట అవే విత్ డ్రా అయ్యే పరిస్థితులు కల్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయంలో రూ.200 -లు పత్రిక కొనుగోలుకు ఇస్తూ అనధికారికంగా పలానా పత్రికనే కొనుగోలు చేయాలని నిర్థేశించినట్లు సమాచారం ఉందని, దానిపై విచారణ జరుగుతోందన్నారు. సంబంధిత జీవోను కూడా రద్దు చేశామన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎం.డి. కె.రాజబాబు, సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత, సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement