Friday, October 18, 2024

AP : నేడు చంద్ర బాబు కేబినెట్ భేటీ

ఆమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నేడు కీలక కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ప్రభుత్వ నూతన పాలసీలు రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం.

పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొచ్చే అవకాశముంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ వచ్చే అవకాశముంది. మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలను అధికారులుమ సిద్దం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలతో ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలు ఓ కొలిక్కి వచ్చాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పన చేస్తున్నారు. జాబ్ ఫస్ట్ (ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం) అనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వ పాలసీలను ప్రభుత్వం సిద్దం చేసింది. పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలు, పొరుగు రాష్ట్రాల్లో ఉత్తమ విధానాలతో కొత్త పాలసీల రూపకల్పనపై ఇవాళ కేబినెట్‌లో చర్చకురానున్నాయి. 5-6 పాలసీలను చర్చించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ , క్లీన్ ఎనర్జీ , ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ , ప్రైవేటు పారిశ్రామిక పార్కులు తదితర పాలసీలు కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్‌గా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక పాలసీ రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్ఎంఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. విద్యుత్ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉండేలా క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకురానుంది.

. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

ఉచిత సిలిండర్ల పథకంపై నేడు నిర్ణయం..దీపావళి నుంచి ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకంపై ఈరోజు కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏపీలో స్వర్ణకార వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్‌లో చర్చించనున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జీవోలు వుంచే goir.ap.gov.in వెబ్‌సైట్‌ను తిరిగి పునరుద్ధరిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీ హయాంలో అప్‌లోడ్ చేయకుండా మాన్యువల్‌గా జారీ చేసిన జీవోలను జీ వో ఐ ఆర్ సైట్లో అప్లోడ్ చేయాలనే దానిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.వైసీపీ హయాంలో రహస్యంగా ఇచ్చిన జీవోలు..వైసీపీ హయాంలో రహస్యంగా ఇచ్చిన జీవోలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు సైట్‌లో ప్రత్యేక బటన్ తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.,

తద్వారా గత ప్రభుత్వం ఇచ్చిన అక్రమ జీవోలు, అడ్డగోలు నిర్ణయాలను ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంటుంది. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ద్వారా వచ్చే కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు స్పెషల్(5), ఫాస్ట్ ట్రాక్(5) న్యాయస్థానాలు ఏర్పాటుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు.

. రాష్ట్రంలో మహిళలు,చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై కూడా కేబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశముంది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు సవరణలు కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement