Friday, October 18, 2024

Ap: జమిలికి ప్రధాని సిద్ధం .. అదే బాటలో మనమూ: ఎమ్మేల్యేలతో చంద్రబాబు

తప్పులు చేయొద్దు
ఆ ప్రభావం కూటమిపై పడుతుంది
గెలిచామని సరిపెట్టుకోవద్దు
కక్ష సాధింపులొద్దు
మళ్లీ రావణ కాష్టం కారాదు
ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితవు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి – తప్పు చేసిన వారిని వదిలి పెట్టకూడదు, అలాగని కక్షసాధింపులకు వెళ్లకూడదు… ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. సంఘటిత శక్తిగా పనిచేస్తేనే ప్రజల అంచనాలను అందుకోగలం. ఎన్డీఏలో ఎవ్వరు తప్పు చేసినా ఆ ప్రభావం ముఖ్యమంత్రి మీదే పడుతుంది, ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అని ఏపీ సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది.

ఎన్టీఆర్ ప్రతిమకు నివాళులర్పించి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడుడుతూ, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సమావేశం పట్ల రాష్ట్రం మొత్తం ఎందుకు ఆసక్తి కనబరుస్తుందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. చేసిన పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని సూచించారు. ఐదేళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్టనష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల బాధను సమన్వయం చేసుకోవాలన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. ఈ విధంగా అధికారులు సహా వ్యవస్థలన్నీ నాశనమైన పరిణామాలు గతంలో చూడలేదన్నారు.

జమిలికి సిద్ధపడటానికే …

- Advertisement -

నాయకుడికి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పట్టినా… చెడకొట్టుకోవాలనుకుంటే నిమిషం చాలు. నాతో సహా ఎవరికైనా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. తదుపరి ఎన్నికలకు సిద్ధమవుతున్నామనే సంకేతం ఇచ్చేందుకే నిన్న ప్రధాని ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో ఐదు గంటలు కూర్చున్నారు. ఇక్కడ మనమూ అదే సిద్ధాంతాన్ని అనుసరించాలి’’ అని స్పష్టం చేశారు.

మళ్లీ రాష్ట్రం రావణ కాష్టమే

వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించటం, పరిమిత వనరుల కారణంగా అన్నీ సరిచేయటానికి సమయం పడుతోందని తెలిపారు. ఏ శాఖలోనూ సరైన ఆడిట్ జరగలేదన్నారు. కేంద్ర నిధులను కూడా ఇష్టానుసారం మళ్లించేశారని మండిపడ్డారు. మనం ఇప్పుడు ప్రవర్తించే విధానం వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడి ఉంటా యన్నారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైసీపీ 11కి పడిపోయిందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలని అన్నారు.

గెలిచామని సరిపెట్టుకోవద్దు
‘గత ఐదేళ్లు సాగిన అరాచకం కారణంగా నాతో సహా, ప్రజలు, నేతలు అంతా ఇబ్బంది పడ్డారు. గెలిచాం కాబట్టి ఇక మన పని అపోయిందనుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయని గుర్తించాలి. యువత, విద్యావవంతులు ఇలా దాదాపు 65 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. మంత్రుల్లో 18 మంది కొత్తవారే ఉన్నారు. ప్రతీ ఇంట్లోనూ చిన్నపాటి సమస్యలుండి సమన్వయం చేసుకున్నట్లే… కుటుంబం లాంటి పార్టీలోనూ ఉండటం సహజం’’ అని చంద్రబాబు వెల్లడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ కు కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తాను సీఎంగా ఉన్న కాలంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని చూడలేదన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని విమర్శించారు. గత పాలకులు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో పార్టీని ముందుకెలా తీసుకెళ్లాలన్న దానిపై సమీక్షించాలని పార్టీ నేతలకు సూచించారు.

అలాగే.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో భాగస్వామ్యంగా ఉన్నామని, మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని చెప్పారు. టీడీపీకి విశ్వసనీయత ఉందన్న చంద్రబాబు.. తాము అధికారం కోసం కాకుండా దేశం కోసం పనిచేశామని పేర్కొన్నారు. ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తాము పదవులు అడగలేదన్నారు. కూటమి అధికారంలోకి రావడానికి క్యాడర్ చాలా త్యాగాలు చేసిందని, వారందరినీ అభినందిస్తున్నానని తెలిపారు. హర్యానాలో ఐదుగంటలపాటు జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు చెప్పారు. కేడర్ లో భారీ అంచనాలున్నాయని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

లిక్కర్ వ్యాపారంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం హెచ్చరించారు. మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని చెప్పారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులే వారిని అధికారానికి దూరం చేసాయని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వలనే బడుమేరు పొంగి విజయవాడకు వరదలు వచ్చాయని చెప్పారు. వరద బాధితులకు సాయం కోసం కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. 2029లోనూ గెలుపు కోసం మిత్రపక్షాలతో సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి ఏపీలో కరువుకు ఆస్కారం లేదన్నారు. కేంద్రం, ఏపీలో చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement