Thursday, October 3, 2024

AP – గంజాయి నిర్మూలనకు యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ – హోం మంత్రి అనిత వెల్లడి

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపుడి అనిత వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో గంజాయి నియంత్రణకు ఏర్పాటుచేసిన ఉపసంఘం సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇదివరకు సెబ్ (స్పెషల్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో)కు అనేక బాధ్యతలు అప్పగించడం వల్ల గంజాయిపై ప్రత్యేక దృష్టిని సారించలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్ ‌ను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. ఇందులో రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని, జిల్లా స్థాయిలో ఎస్పీని నియమించి వారికి ప్రత్యేక సిబ్బందిని అందజేసి పదిరోజుల్లో కార్యచరణ ప్రారంభిస్తామని అన్నారు.

- Advertisement -

రాష్ట్ర స్థాయిలోనే టోల్​ ఫ్రీ ఏర్పాటు..

ప్రస్తుతం గంజాయి నిర్మూలనకు జిల్లా స్థాయిలో ఉన్న టోల్‌ ఫ్రీలు కాకుండా రాష్ట్రస్థాయిలో ఒకే టోల్‌ ఫ్రీ నంబర్‌ను వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. గంజాయి విక్రయిస్తున్న వారినే కాకుండా సరఫరా చేస్తున్న వారిపై , సాగు చేస్తున్న వారిపై దృష్టిని సారిస్తామని ఆమె అన్నారు. గంజాయి నిర్మూలనకు వందరోజుల పాక్షిక ప్రణాళిక, రెండు సంవత్సరాల్లో పూర్తిగా నిర్మూలనకు లాంగ్‌ టర్మ్‌ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు గంజాయి నిర్మూలన సామాజక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ నిర్మూలన కంటే నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement