Sunday, October 6, 2024

AP | లిక్క‌ర్ బిజినెస్‌కు సాఫ్ట్‌వేర్లు రెడీ !

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​: ఏపీలో మద్యం దుకాణాలను ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు ప్ర‌భుత్వం అవకాశం కల్పించింది. దీంతో వాటిని దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఇప్పటి దాకాఈ రంగంలో అనుభవం లేనివారు కూడా దరఖాస్తులు చేస్తున్నారు. అలాంటి వారిలో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్లు, డాక్ట‌ర్లు, ఆడిటర్లు, కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. స్వయంగా ఆఫీసుల‌కు వచ్చి దరఖాస్తు చేసే విషయమై సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు

దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ

ఒక్కో మద్యం షాపుకు ప్రస్తుతం దాఖలు అవుతున్న దరఖాస్తులను పరిశీలిస్తే అంచనాలు మించి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, పొన్నూరు తదితర నగరాల్లో సగటున ఒక్కో షాపునకు 10కి పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎవరైతే మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నడిపారో వారే దరఖాస్తులు చేసుకుంటారని ఎక్సైజ్​ అధికారులు భావించారు. అయితే.. ప్ర‌స్తుతం వస్తున్న దరఖాస్తులను చూసి అంద‌రూ ఆశ్చర్యపోతున్నారు.

పోటెత్తుతున్న దరఖాస్తులు

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎక్సైజ్‌ యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువ మందితో దరఖాస్తులు చేయించేలా అవగాహన కల్పించారు. దరఖాస్తు రుసుము ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం తెచ్చిపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే.. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్లు మాత్రమే షాపుల్లో ఉండేవి.

దీంతో పక్క రాష్ట్రాల నుంచి మద్యం పెద్ద ఎత్తున దిగుమ‌తి అయ్యేది. కానీ, కూటమి ప్రభుత్వం నూతన పాలసీలో భాగంగా అన్ని రకాల బ్రాండ్లు, తక్కువ ధరలకే లభ్యమయ్యేలా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఎవరైనా వచ్చి లాటరీలో షాపు దక్కించుకునేలా పారదర్శకతను తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ సారి దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు పెట్టి దాన్ని నాన్‌ రిఫండబుల్‌ అమౌంట్​గా పేర్కొంది. దీంతో ఎవరైతే సీరియస్‌గా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో వారు మాత్రమే పోటీపడతారని ప్రభుత్వం భావించింది. దీంతో వ్యాపార నిర్వహణ సామర్థ్యం ఉన్న వ్యక్తులు వస్తారని అంచనా వేసింది.

- Advertisement -

ఆరు వాయిదాల్లో చెల్లింపులు..

గతంలో మద్యం దుకాణాల దరఖాస్తు చేసుకోవడానికి రుసుము ₹10 వేలు మాత్రమే ఉండేది. దీంతో ఎవరు పడితే వాళ్లు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేవారు. తీరా షాపు దక్కించుకున్నాక నిర్దేశిత లైసెన్సుకు కట్టాల్సిన ఫీజులు కట్టకుండా మొహం చాటేసేవారు. తిరిగి వాటికి దరఖాస్తులు స్వీకరించాల్సి పరిస్థితి వ‌చ్చేది.

అయితే.. ఇప్పుడు పాలసీలో మాత్రం పట్టణ, రూరల్‌ ప్రాంతాల్లో వసూలు చేసే లైసెన్సు ఫీజు కూడా వేర్వేరుగా నిర్ధారించటంతో పాటు ఏ మండలంలో ఎన్ని షాపులకు పర్మిషన్లు ఇచ్చేది కూడా ముందుగానే ఎక్సైజ్ యంత్రాంగం​ వెల్ల‌డించింది. దీంతో దరఖాస్తు చేసుకొనే వారికి ఒక అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించిన లైసెన్సు ఫీజు చెల్లించటానికి గతంలో మూడు వాయిదాలే ఉండేవి. ప్రస్తుతం దాన్ని ఆరు వాయిదాలకు కూటమి ప్రభుత్వం పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement