Saturday, September 14, 2024

AP – థాంక్యూ…. మోడీజీ : పవన్ కళ్యాణ్

అమరావతి – ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పలు నిర్ణయాలు తీసుకుంది..

దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు.. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇక, కేంద్రం నిర్ణయాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఏపీ ప్రభుత్వం, ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు..

- Advertisement -

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. గత హయాంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడడంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ సవాళ్ల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు పవన్‌ ..

కడప జిల్లా కొప్పర్తిలో రూ. 2,137 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హబ్ రూ. 8,860 కోట్ల పెట్టుబడులు, 54,500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రూ. 2,786 కోట్లతో కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి ద్వారా రూ. 12,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 45,000 మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనాగా ఉంది.. 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం రూ. 15.4 కోట్లు కేటాయించింది.

ఇంకా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం రూ. 4,500 కోట్లు మంజూరు చేసుంది. పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ గ్రామీణాభివృద్ధికి తోడ్పాటు అందించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన కోసం అంకిత భావంతో ఉంది అంటూ ట్వీట్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement