Monday, October 7, 2024

AP | పర్యావరణహితంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకొంటే మేలు: డిప్యూటీ సీఎం

పండుగలు, ఉత్సవాలు పర్యావరణ హితంగా జరుపుకోవాలని, అప్పుడే పర్యావరణం బాగుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అదొక్కటే మార్గమని ఆయన అన్నారు. వినాయక చవితికి మట్టి విగ్ర‌హాల‌ను పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తున్నారు పవన్ కల్యాణ్. ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలు పవన్ కల్యాణ్ కార్యాలయానికి అందుతున్నాయి. తమ అనుభవాలను తెలియచేస్తూ నివేదికలు పంపిస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్ మంగళగిరిలో పవన్ కల్యాణ్ ను ఆయన నివాసంలో కలిశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గోవింద భోగ్, రత్న చోడి, మాప్పిల్లై సాంబ తదితర బియ్యం రకాలను పవన్ కు చూపించారు.

- Advertisement -

పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా…

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుంది. వినాయక చవితి రాబోతుంది. ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చు. మట్టి గణపతికి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాము.

అదే విధంగా దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్ తో చేసిన కవర్లలో అందిస్తున్నారు. బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని పలువురు నిపుణులు సూచించారు. అలాంటి కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడితే అవి వ్యర్థాల నిర్వహణ కూడా సులభం. వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నాము” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement