Tuesday, July 2, 2024

AP: ఎడ్ సెట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదల..

ఫలితాలను విడుదల చేసిన ఎడ్ సెట్ కన్వీనర్ ఆచార్య టి.వెంకటకృష్ణ
ఫలితాల్లో బాలికలదే పై చేయి

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్ సెట్ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం ఉదయం కన్వీనర్ ఆచార్య టీ.వెంకట కృష్ణ విడుదల చేశారు. విశాఖలోని ఎడ్ సెట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేసి అనంతరం ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. ఈనెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 26జిల్లాల పరిధిలో 52 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించారు.

పరీక్షకు 10,805 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 9,365 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,183 మంది పరీక్షకు అర్హత సాధించారు. దీంతో ఎడ్ సెట్ ఉత్తీర్ణత శాతం 98.05గా నమోదైంది. పరీక్షకు హాజరైన వారిలో 80శాతం మంది మహిళలు కాగా, 20శాతం మంది పురుషులు ఉన్నారు. మొదటి 10 ర్యాంకులు సాధించిన వారిలో ఎనిమిది మంది అమ్మాయిలు ఉండగా, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

మెథడాలజీ వారీగా ఫలితాలను పరిశీలిస్తే ఫిజికల్ సైన్స్ లో అత్యధికంగా 99.59%, గణితంలో 99.46%, ఇంగ్లీషులో 98.56%, సోషల్ స్టడీస్ లో 97.04%, బయలాజికల్ సైన్స్ లో 96.86%, మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా ఉత్తీర్ణత పరిశీలిస్తే 99.62 శాతంతో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, ఏలూరు జిల్లా 99.56% ఉత్తీర్ణతతో రెండో స్థానంలోనూ, గుంటూరు జిల్లా 99.12% మూడో స్థానంలో నిలిచింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిలో పురుషులు 98.08% ఉండగా, మహిళలు 98.05% మంది ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

ఈకార్యక్రమంలో ఎడ్ సెట్ 2024 కోర్ కమిటీ సభ్యులు ఆచార్య పాల్ డగ్లస్ ఆచార్య లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య టీ.వెంకటకృష్ణ మాట్లాడుతూ… ఎడ్ సెట్ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహణకు అవసరమైన బాధ్యతలను తనకు అప్పగించిన ఏయు అధికారులకు, ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement