Friday, October 18, 2024

AP – దంప‌తుల ఆశ‌ల‌ను చిదిమేసిన‌ కాళరాత్రి

  • తెల్లారితే గృహ ప్రవేశం
  • కూలిన పాత ఇంటికి స్లాబ్
  • అంతలోనే అనంత లోకాలకు..
  • విషాదం మిగిల్చిన దంపతుల మరణం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అనంత‌పురం – విధి ఎంత విచిత్రమైనదో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఆ ఒక్క రాత్రి గడిస్తే బతికే వాళ్ళు. తెల్లారితే గృహప్రవేశం.. కొత్త ఇంట్లోకి వెళుతున్నాం అన్న సంతోషంతో ఉన్నారు. తమ కల సాకారమైందని కలలు కంటూ నిద్రపోయిన ఆ దంపతులకు అదే చివరి రాత్రి అయ్యింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగికి చెందిన మారెప్ప (49), లక్ష్మి (45) కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేసే మారెప్ప దంపతులు కష్టపడి డబ్బులు కూడబెట్టి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. ఈరోజు మారెప్ప దంపతులు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నారు. ఈ క్రమంలో మారెప్ప, లక్ష్మీ దంపతులు గృహప్రవేశానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ముందురోజు తమ పాత పెంకుటింటిలో పడుకున్నారు.

- Advertisement -

రాత్రి కురిసిన వర్షం కారణంగా మట్టి గోడలు బాగా తడిచి అర్ధరాత్రి ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలింది. మారెప్ప, లక్ష్మి దంపతులు నిద్రిస్తుండగా వారిపై పడింది. దీంతో భార్యాభర్తలిద్దరూ శిథిలాల కింద పడి చనిపోయారు. పక్కన వేరే గదిలో నిద్రిస్తున్న కూతురు, కుమారుడు, బంధువులకు స్వల్ప గాయాలయ్యాయి. తెల్లారితే గృహప్రవేశం చేసి కళకళలాడుతూ ఉండాల్సిన మారెప్ప, లక్ష్మి దంపతుల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో తమ జీవితం ఆనందమయంగా ఉంటుందని ఎన్నో కలలతో పడుకున్న మారెప్ప, లక్ష్మి దంపతులు తమకు ఇదే చివరి రాత్రి అయింది. ఈ ఒక్క రాత్రి గడిస్తే భార్యభర్తలు బతికే వాళ్ళు అని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. విధి ఎంత బలీయమైనదో.. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అనడానికి ఈ విషాదఘటన నిలువెత్తు ఉదాహరణ అంటూ చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement