Monday, October 21, 2024

AP | 5, 6 తేదీల్లో కలెక్టర్ల సమావేశం..

అమరావతి,ఆంధ్రప్రభ: రాజధాని అమరావతి సచివాలయలో ఈనెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లండించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ, రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నామని, మొదటి రోజు కలెక్టర్లతోను, రెండవ రోజు కలెక్టర్లు, ఎస్పిీలతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 5వతేదీ ఉదయం 10గం.ల నుండి 11 గం.ల వరకూ కలెక్టర్ల సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండు రోజుల్లోను ఉదయం 10గం.ల నుండి సా.6గం.ల వరకూ కలెక్టర్ల సమావేశం ఉంటుందని స్పెషల్‌ సిఎస్‌ సిసోడియా పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ల సమావేశానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు స్పెషల్‌ సీఎస్‌ ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈసమావేశానికి హాజరయ్యే కలెక్టర్లు, ఎస్పిీలకు తగిన రవాణా, వసతి వంటి ఏర్పాట్లు చూడాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజనను ఆదేశించారు. అలాగే కలెక్టర్ల సమావేశం నిర్వహణకు అవసరమైన వివిధ సహాయ సిబ్బందిని సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మిని ఆదేశించారు.

అదే విధంగా భద్రత, అగ్నిమాపక సంబంధిత భద్రతా చర్యలను గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, సచివాలయ ఎస్పిఎఫ్‌ అధికారులు చూడాలని చెప్పారు. కలక్టర్ల సమావేశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులకు ఆహ్వానాలు పంపే ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా చెప్పారు.

- Advertisement -

అదే విధంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, ఆడియో వీడియో సిస్టమ్‌,మీడియా కవరేజ్‌,మినిట్స్‌ రికార్డు వంటి అంశాలకు సంబంధించి ఐటి అండ్‌ సి,ప్రణాళిక,ఐ అండ్‌ పిఆర్‌,సిఆర్డిఏ విభాగాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సిసోడియా ఆదేశించారు.

ఈ సన్నాహక సమావేశంలో సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి,అదనపు సిీసీఎల్‌ఏ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, గుంటూరు రేంజ్‌ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, గుంటూరు జిల్లా కలక్టర్‌ నాగలక్ష్మి, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన,ప్రణాళికా శాఖ డైరెక్టర్‌ ఆర్‌.రాంబాబు, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, సీఆర్డీయే అదనపు కార్యదర్శి శివరామ కృష్ణ, జీఏడీ డిప్యూటీ సెక్రటరీ రామసుబ్బయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement