Tuesday, September 17, 2024

AP – అప్రమత్తంగా ఉండండి – రెడ్ అలెర్ట్ జిల్లాల కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఏపీలో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. బుడమేరు వరద నీటి ప్రభావం తగ్గినందున కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.సాయంత్రానికి అన్ని ప్రాంతాలు వరద నుంచి బయటపడొచ్చని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపైనా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలని ఆదేశించారు. కాల్వల్లో వరద ప్రవాహాలు, గట్ల పటిష్ఠతను డ్రోన్ల ద్వారా అంచానా వేయాలని సూచించారు.

భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్‌లోకి వచ్చే నీరు.. పంపే నీటిని బ్యాలెన్స్‌ చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని సూచించారు. విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్‌ పునరుద్ధరణ పూర్తయిందని సీఎంకు అధికారులు వివరించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని.. వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement