Saturday, October 5, 2024

Condolence – రాజేంద్ర‌ప్ర‌సాద్ కుమార్తె క‌న్నుమూత … చంద్ర‌బాబు, ప‌వ‌న్ సంతాపం

సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. కుమార్తె మరణంతో రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. రాజేంద్రప్రసాద్ కు ఏపీ సిఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ సానుభూతి తెలియజేశారు.

చంద్ర‌బాబు సంతాపం

రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి (38) మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ”సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి చిన్న వయసులోనే అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను” అని చంద్రబాబు సంతాపం తెలియజేశారు

ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగ్ర్రాంతి..

రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ కు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. పుత్రిక వియోగాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని రాజేంద్రప్రసాద్ కు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు.

- Advertisement -

ఆమె మర‌ణం విషాద‌క‌రం …
జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ… తనకు అత్యంత ఆప్తులైన రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం చాలా విషాదకరమని అన్నారు. గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement