Tuesday, September 24, 2024

AP – అనంత‌లో ర‌థం కాల్చివేత‌ – నిప్పుపెట్టిన వారిని అరెస్ట్ చేయాల‌ని చంద్రబాబు ఆదేశం

శ్రీరామాల‌యంలో అర్థ‌రాత్రి ఘ‌ట‌న‌
ఘ‌ట‌న‌ను ఖండించిన‌ చంద్ర‌బాబు
నిప్పుపెట్టిన వారిని అరెస్ట్ చేయాల‌ని ఆదేశం
ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం ఇవ్వాల‌ని ఎస్పీకి ఆదేశం
ఘ‌ట‌న స్థలానికి వెళ్లాల‌ని క‌లెక్ట‌ర్ కు సూచ‌న‌
పూర్తి నివేదిక అందించాల‌ని ఆదేశం

అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన పై స్థానికులు గమనించి మంటలను ఆర్పి వేయడంతో అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది.. ఇక, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలాన్ని చేరుకున్న కళ్యాణ్ దుర్గం డివిజన్ డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాలిపోయిన తీరును డీఎస్పీ రవిబాబు పరిశీలించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రథం కాలిన ప్రదేశంలో నిందితులకు సంబంధించి విలువైన సంచారం సేకరించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిందితులకోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు.. అనంతపురం జిల్లాలో రథం దగ్ధంపై అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు .. కనేకల్ మండలం హనకనహల్ లో అర్ధరాత్రి ఆలయ రథం దగ్ధం అయిన ఘటనను తీవ్రంగా ఖండించారు సీఎం . అధికారులతో మాట్లాడిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.. అయితే, అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు తెలిపిన జిల్లా అధికారులు.. దీంతో ఘటన పై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని.. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు చంద్రబాబు. ఇక, అనంతపురంలో రథం దగ్ధం ఘటనపై చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. ఘటనా స్థలానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.. ఘటనకు గల కారణాలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలన్న చంద్రబాబు. నిందితులని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement