Friday, September 13, 2024

AP – గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు – చంద్ర బాబు

ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి :- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 2014-19 మధ్య చేపట్టిన పలు కార్యక్రమాల ద్వారా నాడు గ్రామాల రూపు రేఖలు మార్చితే….గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చిందని సీఎం అన్నారు. మళ్లీ గ్రామాల్లో వెలుగు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీ రాజ్ శాఖకు జవసత్వాలు అందిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏమి అవసరమో గుర్తిస్తాం…సదుపాయాలు కల్పిస్తామన్నారు.

- Advertisement -

ఒక ఇంటికి అవ‌స‌ర‌మైన‌ విద్యుత్, గ్యాస్, టాయిలెట్, నీటి కుళాయి వంటి వాటిని అందించేందుకు ప్రణాళికా బద్దంగా పనిచేయాలన్నారు. అలాగే ఒక గ్రామానికి అవ‌స‌ర‌మైన వీధి లైట్లు, డ్రైనేజీ కాలువ‌లు, సిమెంటు రోడ్లు, తాగునీటి సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాల వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. గ్రామం నుంచి సమీప ప్రాంతాల‌ అనుసంధానం కోసం రోడ్లు, మార్కెట్ ప్లేస్ లు వంటివి ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. వీటిని కూడా కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ సమగ్రమైన ప్రణాళికతో రానున్నరోజుల్లో పనిచేయాలని సూచించారు.

వచ్చే జనవరి నుంచి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని….గ్రామాల అభివృద్ధికి ముందుకు వచ్చే వారితో కలిసి పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని సీఎం తెలిపారు.

సచివాలయంలో మంగళవారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలపై సీఎం సమీక్ష చేశారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ క‌ల్యాణ్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

*రాబోయే 5 ఏళ్లలో 17,500 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం*

ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి పలు అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ‘గత ప్రభుత్వం తీరుతో గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లాయి….దీని వల్ల కనీస స్థాయిలో కూడా మౌలిక‌ సదుపాయాల కల్పన జరగలేదు. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖకు రావాల్సిన రూ.990 కోట్లను ఆర్థిక శాఖనుంచి విడుదల చేస్తున్నామన్నారు. ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీళ్లు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జల్ జీవన్ మిషన్ పనుల్లో రాష్ట్రం 19వ స్థానానికి దిగజారిపోయిందంటే నాటి ప్రభుత్వ అలసత్వానికి ఉదాహరణ. జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర వాటా కింద ఆర్థిక శాఖ నుంచి రూ.500 కోట్లు వెంటనే విడుదల చేస్తాం. కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. అలాగే రాబోయే ఐదు సంవ‌త్స‌రాల్లో 17,500 కిలో మీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మాణం, 10 వేల కి.మీ సీసీ డ్రైనేజీ కాల‌వ‌ల‌ నిర్మాణం జరపాలి. ఈ పనుల పూర్తికి ఎంత సమయం పడుతుంది…ఏడాదికి ఎంతమేర ప‌నులు చేయగలరు అనేది లక్ష్యంగా నిర్ధేశించుకుని వెళ్లాలి.’ అని సీఎం సూచించారు.

నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎల్ఈడి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తే తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటి నిర్వహణ కూడా చేప‌ట్ట‌కుండా వ‌దిలేసిన వైనాన్ని అధికారులు వివరించారు. ఇప్పుడు గ్రామాల్లో 60 శాతం లైట్లు మాత్రమే వెలుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి రూ.482 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందని..గత 5 ఏళ్లుగా ఆ నిధులు విడుదల చేయకపోవడం వల్ల కొత్త లైట్లు ఏర్పాటు, నిర్వహణ మూలన పడిందని అధికారులు తెలిపారు.

అయితే దశల వారీగా ఈ చెల్లింపులు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల భవనాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని సిఎం సూచించారు. అలాగే గ్రామాల్లో చేప‌ట్టే నరేగా పనులపై ఆయా గ్రామాల్లో త‌ప్ప‌నిస‌రిగా గ్రామ సభలు నిర్వహించాలన్నారు. కొత్త వ్యవస్థలు వచ్చినా గ్రామ స‌ర్పంచిని గౌరవించుకోవాల్సిన అసవరముంద‌ని సీఎం అన్నారు. గత ప్రభుత్వ తీరువల్ల మూలనపడ్డ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను మళ్లీ ప్రారంభించాలని సీఎం చెప్పారు. నరేగా పనులపై చర్చించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల‌న్నిటినీ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 2014-19 మధ్య ఎన్టీఆర్ జలసిరి కింద 32,693 బోర్లు వేసి పంపు సెట్లు బిగిస్తే…గత ప్రభుత్వం కేవలం 2,580 పంపు సెట్లు మాత్రమే ఇచ్చిందని అధికారులు వివరించారు. రానున్న రోజుల్లో 10 వేల కిలోమీటర్ల డ్రైన్ లు, 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేయాలి అని లక్ష్యం గా పెట్టుకున్నామని….అలాగే 5 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వకాలు లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని అధికారులు వివరించారు.

.*ప్రజలను ప్రకృతికి చేరువ చేయండి*‘

రాష్ట్రంలో అడవుల పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. హార్టికల్చర్ తో కలుపుకుని రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ బెల్ట్ సాధించాలని సీఎం అన్నారు. నగర వనం కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాల్లో, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు చేపట్టాలని సీఎం తెలిపారు. పకృతితో ప్రజలు మమేకమయ్యే పరిస్థితి కల్పించాలని ఆయన అభిప్రాయడప్డారు. పచ్చదనం పెంచేతే ప్రజలు ఆ ప్రాంతాలకు వచ్చి సేదతీరుతారని… .అలాంటి వాతావరణం కల్పించాలని సీఎం అన్నారు.

రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టులకు అనేక అవకాశాలున్నాయని….ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అడవుల్లో టూరిజం అభివృద్ధికి కార్యక్రమాలుచేపట్టాలని సీఎం సూచించారు.

ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. డిపోల్లో ఉన్న ఎర్రచందనం నిల్వలను పరిరక్షిచాలని సూచించారు. 6 నెలలకు ఒక్క సారి ఎర్రచందనం వేలం నిర్వహించాలని సీఎం సూచించారు. మడ అడవుల అభివృద్ధి, పరిరక్షణ కోసం రాజీ లేకుండా పనిచేయాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖలో గత కొద్ది రోజుల్లో తీసుకున్న పలు నిర్ణయాలను, సంస్కరణలను ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం పవన్ క‌ల్యాణ్‌ సమీక్షలో వివరించారు.

గ్రామాల ముఖచిత్రం మార్చడంలో కీలకమైన పంచాయతీ రాజ్, రూరల్ డెవలెప్మెంట్ శాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని….నేడు మళ్లీ నిధులు, కొత్త విధానాల ద్వారా గ్రామాల్లో సమూల మార్పులు తీసుకువస్తామని ముఖ్యమంత్రికి పవన్ క‌ల్యాణ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement