Tuesday, September 17, 2024

AP Capital – అమరావతికి మహర్దశ – సీఆర్డీయే అధికారులతో చంద్ర బాబు సమీక్ష

ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి : గత ప్రభుత్వం తగ్గించిన సీఆర్డీయే పరిధిని మళ్లీ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలో సీఆర్డీయే అథారిటీ 36వ సమావేశం జరిగింది.

గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. గతంలో ల్యాండ్‌ పొందిన వాళ్లు మళ్లీ ఎన్నిరోజుల్లో నిర్మాణాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. మొత్తం 12 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సంపదసృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చే వారికి భూ కేటాయింపులు జరపాలని సీఎం సూచించారు.

- Advertisement -

గతంలో జరిపిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేసి.. ఆసక్తి చూపే, పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం ఇవ్వాలన్నారు. ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలి, ఎవరికి భూములు కేటాయించాలనే అంశంపై చర్చించారు. సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువు రెండేళ్లు పొడిగిస్తూ సమావేశంలో నిర్ణయించారు

.దేశంలో టాప్ 10 కాలేజీలు, స్కూల్స్, ఆసుపత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలన్నారు. 2015లో తెచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8352 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఉంటుందని సీఎం వివరించారు. గతంలో గుర్తించిన విస్తీర్ణమే సీఆర్డీయే పరిధి అని సీఎం స్పష్టం చేశారు. మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ వెనక్కి తేవాలని అధికారులకు సూచించారు.

కుట్రపూరితంగా తెచ్చిన ఆర్ -5 జోన్ పైనా సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై లోతైన సమీక్ష జరుపుతున్నామని అధికారులు సీఎంకి వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లేన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఆర్డీయే కోసం 32 కన్సల్టెంట్లను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా నదిపై ఆరు బ్రిడ్జిలు: మంత్రి నారాయణ

సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ..హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. సీఆర్డీయేలో కొత్తగా 778 మంది ఉద్యోగులను నియమించుకుంటామన్నారు. సీఆర్డీయే కోసం 32 మంది కన్సల్టెంట్లను తీసుకోవడానికి అథారిటీ నిర్ణయించిందన్నారు.

సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ఈ విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించామన్నారు. క్యాపిటల్ సిటీ ఎంత వరకు ఉంటే అంత వరకు కరకట్ట రోడ్డు నిర్మాణం ఉంటుందన్నారు.

అమరావతిలోని ఈ-5, 11, 13, 15 రోడ్లను ఎన్‌హెచ్‌కు కలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతికి ఈఆర్ఆర్, ఓఆర్ఆర్‌లు ఉంటాయన్నారు. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణా నదిపై ఆరు బ్రిడ్జిలు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణమే చేపట్టనున్నట్టు తెలిపారు.

ఆర్-5 జోన్ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు. న్యాయ పరిశీలన అనంతరం దానిపై తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. స్టార్టప్ ఏరియాపై సింగపూర్ ప్రభుత్వాన్ని తిరిగి సంప్రదించాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement