Friday, September 20, 2024

AP – న్యాయం చేస్తాం…. మీకూ భ‌ద్ర‌తా క‌ల్పిస్తాం …. నటి జెత్వానికి హోం మంత్రి హామీ

హోం మంత్రి అనితను కలిసిన ముంబయి న‌టి కాదంబ‌రి
కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
విజయవాడలో భద్రత కల్పించాల‌ని న‌టి విన‌తి
నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పిన హోంమంత్రి

అమరావతి- ముంబయ్ నటి జెత్వాని కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్ లో కుటుంబ సభ్యులతో సహా తనను కలవడానికి వచ్చిన ముంబయ్ నటి జెత్వానికి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోం మంత్రి గుర్తు చేశారు.

అందుకు ముంబయ్ నటి జెత్వాని ప్రభుత్వం, హోం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని నటి జెత్వాని కోరారు. కేసు ముగిసేవరకూ విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని నటి జెత్వాని హోంమంత్రికి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన హోంమంత్రి భద్రత విషయంలో భయపడాల్సిన అవసరంలేదని లోతైన విచారణ చేసి నిందితులకు శిక్షపడే వరకూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అందరూ ఆమెకు అండగా ఉంటామన్నారు.

- Advertisement -

కొత్త ప్రభుత్వం స్పందించిన తీరు వల్లే ధైర్యంగా తమ బాధను గొంతు విప్పి చెప్పుకోగలిగామని ముంబయ్ నటి జెత్వాని తండ్రి హోంమంత్రితో అన్నారు. కేసు నమోదైన అనంతరం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన పత్రిక, ఛానల్ ల గురించి ముంబయ్ నటి జెత్వాని హోంమంత్రికి బావోద్వేగంతో వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా స్వేచ్ఛ రాలేదనడానికి నీ పరిస్థితి మరో ఉదాహరణ అంటూ హోంమంత్రి అనిత జెత్వానిని ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement