Monday, July 8, 2024

Andhra Pradesh – ప‌ట్టిసీమ పైపులైన్‌ డ్యామేజీ – ఎగిసిప‌డ్డ నీళ్లు – రైతుల్లో ఆందోళన ..

ఆంధ్రప్రభ స్మార్ట్, పట్టిసీమ ప్రతినిధి: పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాదితాగునీటి ఎద్దడిని తట్టుకోలేక కొద్ది రోజులు పట్టిసీమను వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది. ఈ ఏడాది నాగార్జున ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా రైతులను ఆదుకునేందుకు పట్టిసీమ మోటార్లతో నీటి తరలింపు ప్రారంభించారు.ఏలూరు జిల్లా పోలవరంమండలం విక్కిసిరావుపేట వద్ద శుక్రవారం ఉదయం పట్టిసీమ పైప్ లైన్ పగిలిపోయింది.

వాల్ లీకేజీతో..

- Advertisement -

ఎయిర్ వాల్ లీక్ ఘటనతో 20 అడుగులు ఎత్తులో నీళ్లు ఎగిసిపడుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైప్ లైన్ ద్వారా కుడి కాల్వలోకి నీళ్లు వెళ్లే మార్గంలో పైప్ లైన్ ధ్వంసమైంది. ఈ క్రమంలో గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గోదావరి నది నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్‌ ఏర్పాటు చేశారు.రెండు రోజుల కిందట మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు.పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు తాజాగా విడుదల చేశారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పైప్‌లైన్ లీకేజీ జరిగింది. ఇటుకల కోట డెలివరీ ఛానల్‌కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటిని లిఫ్ట్ చేయడం లేదు.

రైతుల్లో ఆందోళన ..
పైప్ లైన్ లీకేజీతో తమ పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నీటి లీకేజీ అరికట్టాలని కోరుతున్నారు. మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటార్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు.

మంత్రి నిమ్మల ఆదేశాలు
అటు, ఈ ఘటనపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్‌లతో నిమ్మల ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే లీకేజిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఇటుకల కోట డెలివరీ ఛానల్‌కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జలాలు ఎగజిమ్ముతున్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది. లీకేజీ ప్రాంతానికి వెళ్ళడానికి , పొలాల్లోకి వెళ్ళడానికి మార్గం మూసుకు పోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement