Sunday, September 8, 2024

Allert – రైల్వే ప్రయాణికులకు అలర్ట్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్ ప్ర‌తినిధి : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 1 నుంచి పలు రైళ్ల టైమింగ్స్ లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. నాలుగు రైళ్ల ప్రయాణ సమయాలు, వేళలను మారుస్తున్నట్లు దక్షిణ మధ్య(ద.మ) రైల్వే ప్రకటించింది. వీటిలో సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.

కొత్త షెఢ్యూల్ ప్ర‌కారం
సికింద్రాబాద్‌-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌(12710)లో గమ్యస్థానం చేరేందుకు ప్రస్తుత ప్రయాణ సమయం 10.35 గంటలు. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.40కి గూడూరు చేరుతుంది. సవరించిన ప్రయాణ వేళల ప్రకారం రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమై ఉదయం 8.55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. అంటే ప్రయాణ సమయం 10.50 గంటలకు పెరగనుంది. ఇదివరకటి సమయంతో పోల్చితే సికింద్రాబాద్‌ నుంచి గూడూరుకు చేరుకోవడానికి అదనంగా 15 నిమిషాలు పడుతుంది. ఈ రైలు విజయవాడకు వేకువజామున 4.30కి బదులుగా 3.35కి చేరుతుంది.

- Advertisement -

  • సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌(12764) ప్రయాణ వేళలు గూడూరు స్టేషన్‌ నుంచి మారనున్నాయి. గూడూరుకు తెల్లవారుజామున 4.43కి బదులుగా 4.19కి చేరుకుంటుంది. తిరుపతి స్టేషన్‌కు ఉదయం 7.15కి బదులు 6.55కి చేరుకుంటుంది. ప్రయాణ సమయం 4 నిమిషాలు పెరగనుంది.

  • లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌(12734) సాయంత్రం 6.25కి బదులుగా సాయంత్రం 5.30కి బయల్దేరనుంది. తిరుపతికి ఉదయం 7 గంటలకు బదులుగా 5.55 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణ సమయం 12.35 గంటల నుంచి 12.25 గంటలకు తగ్గనుంది. ఈ లెక్కన ప్రయాణికులకు 10 నిమిషాల సమయం ఆదా అవుతుంది.

  • ఏపీలోని నర్సాపూర్‌ నుంచి మహారాష్ట్రలోని నాగర్‌సోల్‌కి వెళ్లే నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌(17231) ప్రయాణ సమయం 10.30 నుంచి 9.40కి తగ్గనుంది. ప్రస్తుతం ఉదయం 11.15కి బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.45కి చేరుకుంటుండగా కొత్త సమయం ప్రకారం రాత్రి 9.50కి బయల్దేరి ఉదయం 7.30కి చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement