Sunday, September 15, 2024

AP | ఆరోపణలు సరికాదు.. విచారణ జరపండి : ఎమ్మెల్యే కొలికపూడి

(ప్రభ న్యూస్, విజయవాడ) : ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తాను ఎటువంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడలేదని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ ప్రకటించారు. అనవసరంగా ప్రత్యర్థులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మట్టి తవ్వకాలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.

తానే నిజంగా అవినీతికి అక్రమాలకు పాల్పడినట్లు నిరూపితం అయితే శిక్షార్హురుడని చెప్పారు. తన పని తీరుపై వస్తున్న విమర్శలు ఆరోపణలపై తక్షణమే పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సుజనకు ఎమ్మెల్యే శ్రీనివాసరావు లేఖ రాశారు.

తనపై ఎమ్మార్వో ఆరోపణపై విచారణ జరపాలని కలెక్టర్ ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి కోరారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ని కలిసి తిరువూరు నియోజకవర్గంలో ఏ.కొండూరు మండలం ఎంఆర్వో ఆశయ్య తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

కొలికపూడి రాసిన లేఖ ప్రకారం, కొద్దిరోజుల క్రితం తన కార్యాలయానికి సీపీఐ పార్టీ నాయకులతో దాదాపు గంటసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పిన ఎంఆర్వో, శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఒక వ్యక్తి నుండి 50 లక్షలు తీసుకున్నాడని మాటల మధ్యలో చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్వయంగా ఎంఆర్వో కి ఫోన్ చేసి అడగగా, సీపీఐ నాయకులే తనకు చెప్పారని చెప్పారు. ఆ మరుసటి రోజే విజయవాడ లో కలెక్టర్ ని కలిసిన కొలికపూడి ఎంఆర్వో మీద పిర్యాదు చేసి, మొత్తం విషయం మీద విచారణ చేసి వాస్తవాలు బయటపెట్టాలని కలెక్టర్ ని కోరారు. వాస్తవాలు ఎట్టి పరిస్థితుల్లోనే బయటికి రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement