Friday, October 4, 2024

All Set – చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి భేటికి స‌ర్వం సిద్ధం…. విభ‌జ‌న చిక్కుముడులే ప్ర‌ధాన అజెండా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య శనివారం సాయంత్రం జరిగే సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఈ కీలక భేటీకి తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బేగం పేటలోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో జరిగే సీఎంల భేటీలో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన విభజన చట్టంలో సమస్యలు తొమ్మిది, పది షెడ్యూల్‌ అంశాలే ప్రధాన అజెండాగా 10 అంశాలపై చర్చ ఉండనుందని తెలు స్తోంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం రాత్రి పది గంటల వరకు కొనసాగే అవకాశముందని చెబుతున్నారు. ఈ భేటీలో సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఉపముఖ్య మంత్రులు భట్టి విక్రమార్క, పవన్‌ కల్యాణ్‌, తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

తెలుగు రాష్ట్రాల నడుమ అపరిష్కృతంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాల అజెండాను ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. శనివారం నాటి ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం తన అధికారిక నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. అజెండా అంశాలపై రేవంత్‌ రెడ్డి శనివారం ఉదయం కూడా అందుబాటులో ఉన్న స#హచర మంత్రులు, ఉన్నతాధికారులతోనూ చర్చించనున్నట్టు చెబుతున్నారు.

- Advertisement -

విభజన జరిగి పదేళ్లు..

ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవడంతో #హదరాబాద్‌లోని ఆస్తులు, ఇతర పెండింగ్‌ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అంశాలను గతంలోనే కేబినెట్‌ సమావేశం అజెండాలో పొందుపరిచింది. అయితే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపి లేఖ రాశారు. పునర్విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం, తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై సీఎంల భేటీలో చర్చకు రానున్నాయి. పదవ షెడ్యూల్‌లోని తెలుగు అకాడమీ, అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీ, ఉన్నత విద్యా మండలి వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

రాజ్‌భవన్‌, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్‌ సంస్థల బకాయిల అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. అయితే తొమ్మిది, పదవ షెడ్యూల్‌లోని అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ ఇప్పటికే పలు సమావేశాలు నిర్వ#హంచినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో రెండు రాష్ట్రాలు ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి.

ఉమ్మడి రాజధాని జూన్‌ 2తో పూర్తి
ఈ ఏడాది జూన్‌ 2తో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసినందున ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్‌ వ్యూ అతిథి గృహం, సీఐడీ కార్యాలయం, హెర్మిటేజ్‌ కాంప్లెక్స్‌తో పాటు మినిస్టర్‌ క్వార్టర్స్‌, ఐఏఎస్‌ క్వార్టర్స్‌, ఎంప్లాయీస్‌ క్వార్టర్స్‌లో ఏపీకి కేటాయించిన వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. స్థానికత, ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1,853 మంది విద్యుత్‌ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్‌ క్యాష్‌ క్రెడిట్‌, వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై కూడా చర్చించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల సీఎంను కోరారు. ఢిల్లి లో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది.

విద్యుత్‌ బకాయిలపై..

విద్యుత్‌ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై సీఎంల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సుమారు రూ.24 వేల కోట్లు ఏపీ నుంచి రావాల్సి ఉందని తెలంగాణ, రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాలని ఏపీ కోరుతున్న సంగతి తెలిసిందే.

బకాయిలపై ఏపీ సర్కార్‌ దృష్టి?
కాగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఏమున్నాయనే కోణంలో ఏపీ ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్‌ 9, 10 పరిధిలోని సంస్థల విభజన.. ఆస్తుల పంపకాల వంటివి ఇంకా తేలాల్సి ఉంది. ఆర్టీసీ ఆస్తుల విభజన జరగకపోవడం కీలకమైన వ్యవ#హరంగా ఉంది. అలాగే ట్రాన్స్‌కో, ఉన్నత విద్యామండలి, పట్టాణభివృద్ధి శాఖ పరిధిలోని ఏపీ #హౌసింగ్‌ బోర్డు నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల మేర పెండింగ్‌ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సి ఉంది. ఈ అంశాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న క్రమంలో తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల్లో కొంత మొత్తం వచ్చినా.. ఏపీకి కాస్తో కూస్తో ఆర్థిక ఊరట ఉంటుందనేది ప్రభుత్వ పెద్దల భావనగా ఉందట. దీంతో పాటు.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలు.. నదీ జలాల వాటాల గొడవలు.. డిస్కంలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల గొడవ వంటివి కూడా సీఎంల భేటీలో ప్రస్తావనకు తెచ్చేలా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement