Wednesday, September 18, 2024

AP: నేటి నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్…

విశాఖ‌లో అభ్య‌ర్ధుల‌తో ర్యాలీ
భారీగా హాజ‌రైన యువ‌కులు
సెప్టెంబ‌ర్ అయిదో తేది వ‌ర‌కూ కొన‌సాగ‌నున్న ప్ర‌క్రియ‌
విశాఖ‌ప‌ట్నం – అగ్నివీర్‌ నియామక ప్రక్రియలో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ స్థానిక ఆర్.కె. బీచ్ వద్ద ప్రారంభమైంది. ర్యాలీ నిర్వహణకు పోర్టు స్టేడియంలో అన్ని ఏర్పాట్లూ చేసినప్పటికీ రాత్రి వర్షం కారణంగా ట్రాక్ అంతా తడిసిపోయింది. బురదగా ఉండి జారుతుందనే కారణంతో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సూచనతో అధికారులు ర్యాలీని బీచ్ రోడ్ లో నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేశారు. కాగా, సెప్టెంబర్ 5వ తేదీ వరకూ జరిగే ఈ నియామక ప్రక్రియలో అభ్య‌ర్ధుల‌కు వివిధ రకాల పరీక్షలు నిర్వ‌హించనున్నారు..

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, కాకినాడ, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన యువకులు సెప్టెంబ‌ర్ అయిదో తేదీ వ‌ర‌కూ నిర్వ‌హించ‌నున్న‌ ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు.

ఇవే అర్హ‌త‌లు..
పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్‌ ట్రేడ్‌ మ్యాన్‌ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. పోర్టు స్టేడియానికి ఆదివారం అర్ధరాత్రి నుంచి అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. ఇక, ముందుగా రిజిస్టర్‌ చేసుకొని అడ్మిట్‌ కార్డులు తీసుకున్న వారికి మాత్రమే నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు ఛాన్స్ కల్పించనున్నారు. అడ్మిట్‌ కార్డుల కోసం ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన ప్రతి ఒక్క ధృవపత్రంతో అభ్యర్థులు హాజరవ్వాలని అధికారులు సూచించారు.

- Advertisement -

ద‌ళారుల‌ను ఆశ్ర‌యించ‌వ‌ద్దు…
కాగా, పూర్తి పారదర్శకంగా అగ్నివీర్ నియామక ప్రక్రియ జరుగుతుందనీ.. దళారుల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని రక్షణ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఆర్మీ ర్యాలీకి సంబంధించి పోర్టు స్టేడియంలో అభ్యర్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కలెక్టర్‌ హరేందీర ప్రసాద్, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబత్ర బాగ్చీ పర్యవేక్షించారు. ప్రతి రోజూ 500 నుంచి 800 మంది యువకులు ఈ ర్యాలీలో పాల్గొనే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement