Saturday, September 21, 2024

AP | 230 కేజీల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్‌

మంగళగిరి రూరల్‌ (గుంటూరు) ప్రభ న్యూస్‌: రెండు కార్లలో 230 కేజీల గంజాయిని తుని నుండి తమిళనాడుకు తరలిస్తుండగా, శుక్రవారం రాత్రి స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ సమాచారం మేరకు కాజా టోల్‌ గేట్‌ వద్ద మంగళగిరి సెబ్‌ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రెండు కార్లు, 6 సెల్‌ఫోన్లు, 34 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మంగళగిరి సెబ్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను గుంటూరు జిల్లా సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముందస్తు సమాచారం మేరకు చేపట్టిన తనిఖీలలో భాగంగా కాజా టోల్‌గేట్‌ వద్ద శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టగా, కారులో 230 కేజీల గంజాయిని గుర్తించటంతో పాటు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 30 లక్షలు ఉంటుందన్నారు.

తమిళనాడు పూడుకొట్టాయి అర్నాతాంగికి చెందిన మమ్మద్‌ అమీర్‌, కైలాయిముద్దాన్‌, షేక్‌ అబ్దులా, కార్తీకేయన్‌, ఎస్‌ మల్లిఖార్జున్‌లుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement