Thursday, September 19, 2024

AP | రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. రాష్ట్ర, జిల్లా రహదారులకు ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అదే విధంగా జిల్లా రహదారుల్లో ప్రధాన సమస్యగా ఉన్న పాత్‌ హోల్స్‌ పూడ్చేందుకు మరో రూ.290 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులకు సంభందించి టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆర్వోబీల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన రూ.42 కోట్ల నిధుల విడుదలకు కూడా ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

సచివాలయంలో శుక్రవారం రహదారులు, భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రోడ్‌ నెట్‌ వర్క్‌కు తీవ్ర నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారు అయ్యిందని వ్యాఖ్యానించారు.

వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 4,565 కి.మీ రోడ్లలో మరమ్మతు పనులు చేసేందుకు రూ.186 కోట్లు, వివిధ జిల్లాల్లో గుంతలు పూడ్చడం కోసం రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్‌, లైడార్‌ సాంకేతిక సహాయంతో దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని అంచనా వేసి పనుల చేయాలని ఆదేశించారు. సేతు బంధన్‌ ప్రాజెక్టు ద్వారా నిర్మిస్తున్న ఆర్వైబీలకు భూ సేకరణ కోసం పెండింగ్‌లో ఉన్న రూ.42 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఆ పనులు వెంటనే పూర్తి చెయ్యాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సేతుబంధన్‌, గతి శక్తి వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అన్నీ ఆర్వోబీలను త్వరగా చేపట్టి నిర్దేశిత గడువు లోగా పూర్తి చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్‌ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు.

- Advertisement -

ప్రతి మూడు నెలలకు ఎంత పని పూర్తి చేయగలం అనేది మదింపు చేసుకుని టార్గెట్‌ పెట్టుకుని పనులు పూర్తి చెయ్యాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు కొందరు సక్రమంగా పని చేయడం లేదని, పనితీరు మార్చుకోకపోతే నిబంధనల ప్రకారం చర్యలకు వెనుకాడవద్దని చెప్పారు.

అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్‌, వైజాగ్‌ నుంచి మూలాపేట, విజయవాడ తూర్పు బైపాస్‌, విజయవాడ -హైదరాబాద్‌, బెంగళూరు హైవేల విస్తరణ, హైదరాబాద్‌ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్‌ ఫీల్డ్‌ కారిడార్‌కు సంబంధించి ప్రణాళికలు నేషనల్‌ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని సీఎం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలోమంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement