వెలగపూడి – రాష్ట్రంలోని పేద కుటుంబాలకు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇకపై ప్రతినెలా ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు చౌక ధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని పవన్ వివరించారు.
ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. జగన్ ప్రభుత్వంలో పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలను మూసేసి, ఇంటింటికీ అందిస్తాం అంటూ గొప్పలు చెప్పారు కానీ ఆచరించలేదని మండిపడ్డారు. రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి, ఇంటింటికీ ఇవ్వడం మానేసి నెలలో ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇచ్చారని చెప్పారు పవన్ కల్యాణ్. ప్రధాన కూడళ్లలో వాహనాలు నిలిపి సరుకులు పంపిణీ చేయడంతో ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడ్డారు” అని ఆయన అన్నారు. రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకోవాల్సి వచ్చిందని, చిరుద్యోగాలు చేసుకునేవారు సెలవులు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మిగిలిన రేషన్ బియ్యం, ఇతర సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపిందని పవన్ తెలిపారు. ఈ విచారణలో భాగంగా వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖపట్నం ఓడరేవుల్లో పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటువంటి అక్రమాలను అరికట్టేందుకే, తిరిగి చౌకధరల దుకాణాల ద్వారానే పేదలకు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కొత్త విధానంలో భాగంగా, దివ్యాంగులు మరియు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పేద ప్రజలకు సక్రమంగా, సకాలంలో నిత్యావసరాలు అందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు.