ఇద్దరు నిందితులు అరెస్ట్ – మారుతి కారు సీజ్
చింతూరు, (ఏఎస్ఆర్ జిల్లా), జూన్ 7, (ఆంధ్రప్రభ): చింతూరు మన్యంలో మోతుగూడెం పోలీసులు 100కేజీల గంజాయిని శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. ఈ గంజాయికి సంబంధించిన వివరాలను చింతూరు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో చింతూరు అదనపు ఎస్పీ పంకజ్ కుమార్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్లోని మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ఈ వాహన తనిఖీలు నిర్వహిస్తుండుగా డొంకరాయి వైపు నుండి చింతూరు వైపు వస్తున్న టీఎస్08ఈహెచ్0756 మారుతి స్విప్ట్ కారును ఆపి తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చింతూరు మండలం తూలుగొండ గ్రామానికి చెందిన కరణం రామాంజనేయులు, ఆదే గ్రామానికి చెందిన అరెళ్ల బోజ్జిలు ఇరువురు కలసి కారులో తరలిస్తుండుగా పట్టుకున్నామన్నారు. ఈ కారులో మొత్తం 100కేజీల గంజాయి ఉందని ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.5లక్షల వరకు ఉంటుందని బయట మార్కెట్లో ఇంకా ఎక్కువ ఉంటుందన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు గంజాయి అమ్మిన ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరికి చెందిన చెందిన కొవాసి తాతరావు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకి చెందిన షేక్ సుబ్బానీలపై కేసు నమోదు చేశామన్నారు. పోలీసులకు దొరికిన ఇద్దరు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు.
నిందితుల నేర చరిత్ర..
గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ నిందితులపై గతంలో కేసులు ఉన్నాయని చింతూరు అదనపు ఎస్పీ పేర్కొన్నారు. కొవాసి తాతరావుపై డొంకరాయి, చింతూరు పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు ఉన్నాయని, కరణం రామాంజనేయులుపై చింతూరు పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు, షేక్ సుబ్బానీపై చింతూరు పోలీస్ స్టేషన్ లో ఒక గంజాయి కేసు ఉందన్నారు. ఈ నలుగురు గంజాయి అక్రమ రవాణాకు గ్యాంగ్గా పనిచేస్తున్నారన్నారు.

గంజాయి రవాణాను అడ్డుకునేందుకు డైనమిక్ వాహన తనిఖీలు..
అల్లూరి జిల్లాతో పాటు చింతూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి రవాణాను అడ్డుకునేందకు డైనమిక్ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని చింతూరు అదనపు ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పేర్కోన్నారు. ఈ వాహన తనిఖీలు ఎప్పుడుబడితే అప్పుడు ఎక్కడబడితె అక్కడ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి రవాణా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు గంజాయి వాడకాన్ని పూర్తిగా నివారించండి, గంజాయి వాడకం, రవాణా, సాగు, నిల్వ వంటి చర్యలు చట్టవిరుద్ధమైనవే వాటి జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు. గంజాయి సరఫరా, రవాణా, సాగు లేదా వినియోగంలో పాల్గొనేవారికి ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు విధించబడతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి మినహాయింపు ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో చింతూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ తెల్లం దుర్గాప్రసాద్, మోతుగూడెం ఎస్ఐ షేక్ సాదిక్, చింతూరు ఎస్ఐ పేరూరి రమేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.