చింతూరు/చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజ్, డీఐజీ కమలోచన్ కశ్యప్, జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
పూనా మార్గెమ్, లోన్ వర్రాట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటికి ఆకర్షితులైన అనేక మంది లొంగిపోతున్నారని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులలో 16, 17 సంవత్సరాల ఒక అబ్బాయి, ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు.
మడకం బమన్, మన్కీ అలియాస్ సమీల మాండవి ఒక్కోక్కరిపై రూ. 8 లక్షలు, షామిలా అలియాస్ కోవ్వాసి సోవ్లిు, గంగి అలియాస్ రోహిణి బర్సే, దేవి అలియాస్ మడ్వి కవిత, సంతోష్ మాండవి ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల రివార్డు ఉండగా వీరితో పాటు 30 మందికి రూ.64 లక్షల రివార్డు కలదని తెలిపారు.
లొంగిపోయిన వారందరూ నేరాలతో సంబంధం ఉన్న వారేనని స్పష్టం చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున రావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ప్రస్తుతం వారి జీవనానికి మౌలిక వసతలు సైతం కల్పిస్తామన్నారు. అరణ్యం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు సాధారణ పౌరుల వలె జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద రూ.50 వేల నగదుతోపాటు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, వ్యవసాయ భూమి లాంటి సౌకర్యాలు అందించబడతాయని వెల్లడించారు.
ఈ సమావేశంలో దంతవాడ రేంజ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాకేష్ చౌదరి, సీఆర్పిఎఫ్ కమాండెంట్లు యాదవ్, అనిల్ కుమార్ సింగ్, అనిల్ కుమార్ ప్రసాద్, సునీల్ భవార్, ఇంటిలిజెన్స్ డిప్యూటీ కమాండెంట్ విమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



