మధురై : తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వాన్న గద్దె దించుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మధురైలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా పాల్గొని పార్టీ నేతలతో కీలకంగా చర్చించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, “తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ఎన్డీయే కూటమిగా ప్రభుత్వం ఏర్పరిస్తుంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది,” అని ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసి తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. పార్టీ కార్యకర్తలు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఇక, అంతకుముందు ఆయన మధురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న షా, “తమిళంలో మాట్లాడలేకపోవడం నాకు బాధ కలిగిస్తోంది. ఇది భారతదేశంలోని గొప్ప భాషల్లో ఒకటి. తమిళంలో మాట్లాడలేకపోవడాన్ని మన్నించండి,” అంటూ పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.
