అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు
విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్
కర్నూలు బ్యూరో, అక్టోబర్ 15 (ఆంధ్రప్రభ) : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (అక్టోబరు 15) విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండియన్, కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రధాని పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యం కలిగినది అని, అన్ని శాఖల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు, రవాణా, వేదిక, పార్కింగ్, మీడియా సదుపాయాలు అన్నీ సమయానికి సిద్ధం కావాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో అధికారులు దినేష్, విజయ సునీత, డిల్లీ రావు, శౌర్యమాన్ పటేల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, సచిన్, అలాగే పలు విభాగాల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.