ఉపాధి బిల్లులు ఇవ్వట్లేదు

తుగ్గలి కూలీలు ఆందోళన

ఆంధ్రప్రభ, ( కర్నూలు జిల్లా) : రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలకు ఏకంగా మూడు నెలల నుండి ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) బిల్లులు రాకపోవడంతో కూలీలు (labors) ఆందోళన చెందుతున్నారు. మండలంలోని వ్యవసాయ కూలీలు (agricultural laborers) ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లారు. వీరందరికీ మూడు నెలల నుండి వేతనాలు అంద‌కపోవడంతో తమెలా బతకాలని ప్రభుత్వంపై కూలీలు మండి పడుతున్నారు. ఒకపక్క ప్రభుత్వం వలసల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళొద్దని, గ్రామాలలోనే కూలీలకు జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నామని తెలపడంతో కూలీలు స్థానికంగా ఉపాధి హామీ పనులకు వెళ్లారు. అయితే ఏకంగా మూడు నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడంతో తాము ఎలా బతకాలని ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు (government employees) ఒక రోజు జీతం ఆలస్యం అయితే రోడ్లపైకి ఎక్కి ఆందోళన చేస్తారు. అయితే తమకు మూడు నెలల నుండి వేతనాలు అందకపోవడం ఏమిటని కూలీలు కన్నీటితో తమ ఆవేదనను వెల్ల‌గ‌క్కారు. ఈ నేపథ్యంలో కూలీలు ఉపాధి హామీ పనులకు పనిచేయడానికి రాకపోవడంతో ప్రస్తుతం చేపడుతున్న పండ్ల మొక్కల పెంపకం కూడా నత్త నడకన సాగుతోంది. ఏరోజుకారోజు కూలి అందితేనే వారి కుటుంబ పోషణ గడవడం కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మూడు నెలల నుంచి కూలీలకు వేతనాలు అందకపోవడంతో వారి పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకొని వచ్చి రెండు దశాబ్దాలు (two decades) గడచినా వలసల నివారణ మాత్రం అరికట్టలేకపోవడం విశేషం. ఏ లక్ష్యంతో అయితే అప్పటి ప్రభుత్వం కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకుని వస్తే రాను రాను అటకెక్కిపోతోందని కూలీలు విమర్శిస్తున్నారు. ఏ పథకం అయినా కచ్చి తంగా అమలు జరిగితే అది ప్రజాధరణ పొంది ప్రభుత్వాలను కూడా పథకం వైపు తలోగ్గేపరిస్థితి తీసుకొని వస్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ పథకం తీరు భవిష్యత్తులో మరింత నిర్వీర్యం అయ్యే విధంగా కనిపి స్తోందని పలువురు మేధావులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పథకాన్ని పారదర్శకత కు దూరం చేసి నిర్వీర్యం చేస్తున్నారు అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత వైసిపి ప్రభుత్వం (YSRCP government) కూలీలకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో అప్పటి టిడిపి నాయకులు (TDP leaders) ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగే కూలీలకు వేతనాలు సకాలంలో అందివ్వడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన కూలీల బతుకుల మారడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కూలీలకు వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply