TG | ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీజేపీ దోస్తీ.. మహేష్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీజేపీ రెండు పార్టీలు దోస్తీ చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఫాం హౌస్కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫాంహౌస్లో కేసీఆర్ సేద తీరుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని అన్నారు. ఇవాళ గజ్వేల్ రిమ్మన్నగూడ ఎస్ -4 వద్ద మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.
కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని, బీఆర్ఎస్లో కేటీఆర్ – కవిత – హరీష్రావు ల మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యిందని విమర్శించారు. ఫామ్హౌస్కే పరిమితమైన కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఎందుకు? అని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా ఫామ్హౌస్లో సేద తీరుతున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ విమర్శించారు.
ఇక బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటే బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన నిధులు గాడిద గుడ్డు అని విమర్శించారు. ఇక్కడి బీజేపీ నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడం వారి ఆనవాయితీ అని మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొట్ట మొదటిగా తెలంగాణలో కుల గణన సర్వే జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. కుల గణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని, పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామన్నారు.