హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు ఏ.జగన్మోహన్ రావును క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) అధికారులు అరెస్టు చేశారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 సీజన్లో టిక్కెట్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ అనంతరం ఈ చర్య చేపట్టారు.
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాన్యంతో జరిగిన వివాదమే ఈ అరెస్టుకు కారణమని తెలుస్తోంది. కాంప్లిమెంటరీ టిక్కెట్లు, కార్పొరేట్ బాక్స్లను బ్లాక్మెయిల్ చేసి అదనపు టిక్కెట్లు డిమాండ్ చేసినట్లు SRH ఆరోపించింది. మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాకు కేటాయించిన F3 కార్పొరేట్ బాక్స్ను జగన్మోహన్ రావు లాక్ చేసి, 20 అదనపు కాంప్లిమెంటరీ టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం.
SRH మ్యాచ్లను హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తామని వార్నింగ్ ఇవ్వడం నేపథ్యంలో, ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ దర్యాప్తు కోసం డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.