NASA | రేపే శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర

ఫ్లోరిడా – భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తేదీ ఖరారైంది. యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్‌లో భాగంగా ఆయన రేపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బయలుదేరనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మంగళవారం ఒక ప్రకటనలో అధికారికంగా తెలియజేసింది. పలు వాయిదాల అనంతరం ఈ ప్రయోగానికి ఇప్పుడు మార్గం సుగమమైంది.

నాసా వెల్లడించిన వివరాల ప్రకారం, యాక్సియం-4 మిషన్ ప్రయోగం భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12:01 గంటలకు జరగనుంది. ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదిక కానుంది. ప్రయోగం విజయవంతంగా జరిగిన తర్వాత, వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్) అవుతుందని నాసా పేర్కొంది.

ఈ ప్రతిష్ఠాత్మక యాత్రను అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఈ మిషన్‌లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు కూడా ఈ యాత్రలో పాలుపంచుకోనున్నారు. ఫాల్కన్-9 రాకెట్ ఈ స్పేస్ క్యాప్సూల్‌ను నింగిలోకి మోసుకెళ్లనుండగా, ఇందులో శుభాంశు మిషన్ పైలట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

భూమి నుంచి బయలుదేరిన సుమారు 28 గంటల ప్రయాణం అనంతరం ఈ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుంటుంది. శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అక్కడ 14 రోజుల పాటు బస చేస్తుంది. ఈ సమయంలో వారు భారరహిత స్థితిలో పలు కీలకమైన శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా అంతరిక్షం నుంచే భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటించనున్నారు.

వాస్తవానికి ఈ ప్రయోగం తొలుత మే 29నే జరగాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అన్ని అడ్డంకులను అధిగమించి ఇప్పుడు ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాసా ప్రకటించింది.

Leave a Reply