రాజమహేంద్రవరం : టూరిజం కేంద్రాల అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం (AP Government) గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టనుంది. రూ.97.44 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ కు ఈనెల 27వ తేదిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat), డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లు రాజమహేంద్రవరంలో శంకుస్థాపన చేయనున్నారు. చిరకాల వాంఛగా ఉన్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తాజాగా ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ఇవాళ రాజమండ్రిలో వెల్లడించారు. 127 సంవత్సరాల రాజమండ్రి హ్యావ్ లాక్ వంతెన పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.
రూ.97 కోట్ల 44 లక్షల అంచనాలతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు సిద్ధం కానున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ ఏడాది ఏపీలో టూరిజం అభివృద్ధి 375 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయించుకున్నామన్నారు. ఇకపోతే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు (Akhanda Godavari Tourism Project) ద్వారా రాజమహేంద్రవరం నగరం, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త రానున్నాయి. రాష్ట్రాన్ని మరింత పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.
ఈ నిధులు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ (Special Assistance to State for Capital Investment) పథకం ద్వారా మంజూరయ్యాయి. ఈ రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు వంటి ఇతర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు శరవేంగంగా జరగనున్నాయి. రాబోయే పుష్కరాల లోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగనుంది.