khammam కాంతులీనుతున్న పీవీ విగ్రహ సర్కిల్
khammam కాంతులీనుతున్న పీవీ విగ్రహ సర్కిల్
- మంత్రి తుమ్మల ఆదేశాలతో లకారం జంక్షన్కు కొత్త శోభ
- ఫౌంటెన్లు, రంగురంగుల దీపాలతో ఆకట్టుకుంటున్న నగర ప్రవేశ ద్వారం
ఖమ్మం (khammam ), ఆంధ్రప్రభ:
ఖమ్మం నగరంలోని లకారం జంక్షన్ వద్ద ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ సర్కిల్కు కొత్త అందాలు వచ్చాయి. గత ఆరు నెలలుగా ఫౌంటెన్లు పనిచేయకపోవడం, రంగురంగుల విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో సర్కిల్ నిర్లక్ష్యానికి గురై కళావిహీనంగా మారింది. ఈ పరిస్థితిపై ప్రజలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేయగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి అధికారులను తక్షణ చర్యలకు ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టారు. సర్కిల్లో అత్యాధునిక ఫౌంటెన్లను ఏర్పాటు చేసి, నూతన ఎల్ఈడీ రంగుల దీపాలను అమర్చారు. రాత్రి వేళల్లో నీటి ధారలు, రంగురంగుల కాంతులు కలిసి సర్కిల్కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. పీవీ నరసింహారావు విగ్రహం కూడా విద్యుత్ దీపాల వెలుగులో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
సర్కిల్ చుట్టూ దెబ్బతిన్న పాత గ్రిల్స్ను తొలగించి కొత్త గ్రిల్స్ను ఏర్పాటు చేశారు. అలాగే పరిసర ప్రాంతాల్లో అలంకార మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచారు. దీంతో సర్కిల్ అందం మరింత పెరిగి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
అభివృద్ధి పనులు పూర్తికావడంతో లకారం జంక్షన్ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాయంత్రం వేళల్లో కుటుంబాలతో కలిసి సందర్శకులు ఇక్కడికి వస్తుండగా, యువత ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపుతోంది. నగర సౌందర్యీకరణలో భాగంగా చేపట్టిన ఈ పనులను ప్రజలు అభినందిస్తున్నారు.
స్థానికుల అభిప్రాయం ప్రకారం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. అభివృద్ధి, సౌందర్యం, పచ్చదనం సమ్మిళితమైన పీవీ విగ్రహ సర్కిల్ ఖమ్మం నగరానికి కొత్త గుర్తింపుగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.
