ప్రజల సాక్షిగా సంక్షేమ పాలన.. తిరుపతిలో భారీ సభ

ప్రజల సాక్షిగా సంక్షేమ పాలన.. తిరుపతిలో భారీ సభ

జూన్ 12న దామినేడు వద్ద రాష్ట్ర స్థాయి బహిరంగ సభ

సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రుల హాజరు

50 వేల మందికి తగిన ఏర్పాట్లు: మంత్రి అనగాని సత్యప్రసాద్

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 12న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించి, గత 24 నెలల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా జూన్ 12న జరిగే సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తాం

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తొలుత తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో వేర్వేరుగా సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో కార్యక్రమాల్లో మార్పులు చేసి రాష్ట్ర స్థాయి సభను తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సాయం అందించడంతో పాటు కేంద్రం సహకారంతో మరింత సహాయ సహకారాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

విధ్వంసం నుంచి వికాసం వైపు

రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు.

సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు గత 24 నెలల పాలనను “సూపర్ 24”గా మార్చామని అన్నారు. రైతులకు పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ, మహిళలకు తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని చెప్పారు. డీఎస్సీ నిర్వహణ, మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు, భూ సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని వివరించారు.

50 వేల మందికి తగిన ఏర్పాట్లు

సభకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో పాటు సుమారు 50 వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ప్రాంగణం, పార్కింగ్, తాగునీటి సదుపాయం, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సభను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్స్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply