కొత్త సిఎంగా అందుకు మంత్రి శ్రీధర్ బాబు అర్హుడు
ఆయనకు అక్రమ వసూళ్లు అలవాటు లేదు
అందుకే అధిష్ఠానం వెనుకడుగు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్ బాబుకు అక్రమ వసూళ్లు చేయడం చేతకాదని.. అందుకే ఆ పార్టీ అధిష్టానం వెనకడుగు వేస్తోందని వ్యాఖ్యనించారు. అక్రమ వసూళ్లకు పాల్పడటం, అధిష్టానానికి మూటలు పంపించడం శ్రీధర్ బాబుకు కూడా తెలిసి ఉంటే.. ఆయనే సీఎం అయ్యేవాడని అన్నారు.
రేవంత్ జోకర్ అని తేలిపోయింది
ఎన్నికల ముందు ప్రజలు రేవంత్ రెడ్డిని తురుంఖాన్ అనుకున్నారని.. కానీ ఆయన జోకర్ అని సీఎం అయ్యాకే తేలిపోయిందని అరవింద్ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి సీఎం రేవంత్రెడ్డి సహకారం ఉందన్నారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాకే బీజేపీ రాష్ట్రంలో బలపడిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది ఇక తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.