T20 World Cup | ఆడకుంటే.. ఆగమైతరు!

T20 World Cup | ఆడకుంటే.. ఆగమైతరు!
- పాక్కు ఐసీసీ వార్నింగ్
- నాలుగు రోజుల్లో టీ20 వరల్డ్కప్
- పాక్, భారత్ మ్యాచ్పై సందిగ్ధం
- భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలంటున్న పాకిస్థాన్ ప్రభుత్వం
- ఆడకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామంటున్న ఐసీసీ
T20 World Cup | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు అభిమానులకు పండగే.. ఈ రెండు జట్లు ఆడుతుంటే ఇరు దేశాల్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. వన్డేలు, టీ20లలో ఈ రెండు జట్లు పోటీ పడినప్పుడు స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. ఇండియా, పాక్ దేశాల మధ్య ఉన్న తగాదాల కారనంగా ఈ రెండు జట్ల మధ్య ప్రత్యక్షంగా సిరీస్లు జరగడం లేదు. వరల్డ్ కప్లు జరిగినప్పుడు మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఆ మ్యాచులను చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతారు.
ఈ రెండు జట్ల మధ్య ఎక్కడ మ్యాచ్ జరిగినా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అయితే మరో ఐదు రోజుల్లో పొట్టి ఫార్మట్లో వరల్డ్ కప్ జరగనుంది. ఇది ప్రారంభానికి ముందే వివాదాలకు కేరాఫ్గా మారింది. ముందు బంగ్లాదేశ్.. ఇప్పుడు పాకిస్థాన్. భారత్తో ఉన్న వైరంతో ఈ రెండు దేశాలు… అక్కసు వెళ్లగక్కుతున్నాయి. భారత్లో ఆడమని బంగ్లాదేశ్ మొండి పట్టు పట్టగా.. ఇప్పుడు భారత్తో మ్యాచ్ ఆడమని పాకిస్థాన్ భీష్మించింది. దీనిపై ఐసీసీ గుర్రుగా ఉంది. భారత్తో పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఆడకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది.

ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్లకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ 2012 నుంచి ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఐసీసీ కూడా ఇరు జట్లను ఒకే గ్రూప్లో ఆడిస్తున్నాయి. పాకిస్థాన్.. భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే.. 2010 తర్వాత.. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగని తొలి ఐసీసీ టోర్నీగా 2026 టీ20 ప్రపంచకప్ నిలిచే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించాలని తమ జట్టును ఆదేశించిన పాకిస్థాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రపంచ క్రీడా నిమయాలకు విరుద్దమని, ఇది పాకిస్థాన్ క్రికెట్కు ఏ మాత్రం మంచిది కాదని ఓ ప్రకటనలో హెచ్చరించింది. ‘పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం మా దృష్టికి వచ్చినప్పటికీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి అధికారిక సమాచారం కోసం ఇంకా ఎదురుచూస్తున్నాం. టోర్నీలో ఎంపిక చేసిన మ్యాచ్ల్లో మాత్రమే ఆడటం అనే పాకిస్థాన్ వైఖరి ఆమోదయోగ్యం కాదు. జాతీయ విధానాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాల పాత్రను గుర్తించి, గౌరవిస్తున్నప్పటికీ.. ఈ నిర్ణయం సరైంది కాదు.
పాకిస్థాన్కే తీవ్ర నష్టం..
- పాకిస్థాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే.. ఐసీసీ కఠిన చర్యలు తీసుకోనుంది.
- విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్లో(PSL) పాల్గొనే విషయంలో నిరభ్యంతర పత్రాలు పొందడంలో ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది.
- అలాగే ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చే హక్కులను కూడా పాకిస్థాన్ కోల్పోనుంది.
- ఐసీసీ నుంచి రావాల్సిన వాటాలో కూడా పీసీబీకి భారీ కోత పడనుంది.
- అన్నిటికంటే భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే నెట్రన్రేట్ దెబ్బతిని సూపర్-8, సెమీస్ చేరే అవకాశాలు సన్నగిల్లనున్నాయి.
- ఒకవేళ భారత్, పాక్లు తదుపరి రౌండ్లో తలపడాల్సి వస్తే పాకిస్థాన్ జట్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేదానిపై కూడా స్పష్టత లేదు.
