74 notifications |భూసేకరణ వేగవంతం

74 notifications | భూసేకరణ వేగవంతం
విడివిడిగా సీఆర్డీఏ నోటిఫికేషన్లు
రైతులకు మరో చాన్స్ ఇచ్చిన ప్రభుత్వం
స్వచ్ఛందంగా అంగీకరించాలంటున్న అధికారులు
28 గ్రామాల పరిధిలో 2,766 ఎకరాలు అవసరం
720 ఎకరాల కోసం 74 నోటిఫికేషన్లు జారీ
రైతులకు సర్దిచెబుతూ భరోసా ఇస్తున్న ప్రభుత్వం
74 notifications | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఏపీ సీఆర్డీఏ కీలక అడుగులు వేస్తోంది. కొన్ని చోట్ల రైతులు భూములు ఇవ్వకపోవడంతో పలు ప్రాజెక్టుల పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాంతో తొలి విడత భూసమీకరణ విధానంలో రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల వద్ద నుంచి, ఇప్పుడు భూసేకరణ చట్టం ద్వారా భూములను సేకరించే ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు స్పష్టం చేశారు. అయితే.. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ పరిధిలోని 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అక్కడక్కడా కొన్ని భూములు సీఆర్డీఏకు రాకపోవడం వల్ల రహదారుల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకు అడ్డంకులుగా మారాయి. రాజధానిలోని 28 గ్రామాల పరిధిలో ఇంకా 2,766 ఎకరాల భూమి కావాల్సి ఉండగా, ప్రాజెక్టుల అవసరాల బట్టి సీఆర్డీఏ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. 720 ఎకరాలకు సంబంధించి 74 నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేశారు.

74 notifications | స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే..
సీఆర్డీఏ ఒకవైపు భూసేకరణ నోటిఫికేషన్లు ఇస్తున్నప్పటికీ, మరోవైపు రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా భూసమీకరణ పద్ధతిలో ముందుకు వస్తే భూములను స్వీకరిస్తామని స్పష్టం చేస్తోంది. అధికారుల ప్రకటనకు సానుకూలంగా స్పందించిన రైతులు ఇటీవల 30 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగించారు. రాజధాని అమరావతి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు సీఆర్డీఏ అధికారులు భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చిన గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భూసేకరణ ద్వారా వచ్చే నష్టాల కంటే, భూసమీకరణ కింద భూములిస్తే ప్రభుత్వం ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఉంటాయని అర్థమయ్యేలా చెబుతున్నారు.

74 notifications | రైతులకు అధికారుల భరోసా..
సీఆర్డీఏ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, చివరికి అవార్డు జారీ అయ్యే లోపు ఎప్పుడైనా ల్యాండ్ పూలింగ్కు మారవచ్చని తెలిపారు. అలా వస్తే రోజుల వ్యవధిలోనే ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేస్తామని రైతులకు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న భూముల్లో అత్యధికంగా ఉండవల్లిలో 741 ఎకరాలు, పెనుమాకలో 378 ఎకరాలు ఉన్నాయి. నిడమర్రులో 432 ఎకరాలు, కురగల్లు, నీరుకొండ, రాయపూడి గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా భూములను సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
74 notifications | భూసమీకరణ ద్వారా సమీకరించిన భూమి
అమరావతి చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసమీకరణ విధానం కింద 28 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 33,000 ఎకరాలకు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచంలోనే ఇంత భారీ ఎత్తున ల్యాండ్ పూలింగ్ జరగడం ఒక రికార్డుగా నిలిచింది.
74 notifications | భూసేకరణ, పెండింగ్ భూములు
మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్కు ఇవ్వకుండా మిగిలిపోయిన భూమి 2,766 ఎకరాలు కాగా, ప్రస్తుతం సీఆర్డీఏ ఈ మిగిలిన భూమిని ప్రాజెక్టుల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 720 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయగా, ఇటీవల 30 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కిందకు వచ్చాయి.
ప్రభుత్వ భూములు..
రాజధాని అమరావతి పరిధిలో అడవులు, వాగులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 11,000 ఎకరాల ప్రభుత్వ భూములను సీఆర్డీఏ పరిధిలోకి బదిలీ చేశారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని కోసం ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 44,000 ఎకరాలకు పైగా భూమిని సీఆర్డీఏ తన ఆధీనంలోకి తీసుకుంది. మిగిలిన 2,700 పైచిలుకు ఎకరాలను కూడా సేకరిస్తే రాజధాని లోపల రహదారులు, మౌలిక వసతుల గ్రిడ్ పూర్తిస్థాయిలో అనుసంధానం కానుంది. రెండో విడత భూ సమీకరణ కోసం సైతం సీఆర్డీఏ ఇదివరకు నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో ఇందుకు సంబంధించి భూముల సమీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనాలు అందించడంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది.
click here to read more : 1000 people | విద్యుత్ రంగం.. ప్రైవేట్ పరం
